న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగానే బయో సెక్యూర్ బబుల్లో
ఐపీఎల్ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ టోర్నీ ఆరంభానికి ముందే నిర్ణయించింది.
లీగ్ ప్రారంభమై 25 రోజులు అవుతోంది. అనూహ్యంగా ఇద్దరు కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలడంతో లీగ్ నిర్వాహకులతో పాటు ఫ్రాంఛైజీలు, క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఆటగాళ్లు కరోనా బారినపడడంతో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో లీగ్ నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పత్రికలు, ఛానెళ్లు విమర్శించాయి. తాజాగా కోల్కతాతో పాటు
చెన్నై సూపర్ కింగ్స్లో ముగ్గురికి, డీడీసీఏ గ్రౌండ్ సిబ్బందికి వైరస్ సోకడంతో
ఐపీఎల్ను వాయిదా లేదా రద్దు చేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణను చాలా మంది తప్పబడుతున్నారు. ఐపీఎల్ను వెంటనే రద్దు చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘Cancel IPL’ హ్యాష్ట్యాగ్తో మీమ్స్, సెటైర్లు, కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. దయచేసి ఎలాగైనా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను రద్దు చేయాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.