ఐదుగురు ప్రత్యేక అధికారుల నియామకం
కరోనా వచ్చినవారెవరూ హైదరాబాద్ వెళ్లొద్దు..
ఐసొలేషన్ కేంద్రాలుగా రైతువేదికలు
జిల్లాలో అందుబాటులోకి 924 ఆక్సిజన్ బెడ్లు
రెమిడెసివిర్ ఇంజక్షన్ కొరత లేదు.. ప్రైవేట్ దవాఖానలకూ సరఫరా
కరోనా రోగులకు రూ.250తో పౌష్ఠికాహారం
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్షసంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ) :
సంగారెడ్డి జిల్లాలో కరోనా కట్టడికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు కరోనాపై జిల్లా అధికారులు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీఎంహెచ్వో గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి , అన్ని ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లు, ఆర్డీవో నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి, రోగులకు వైద్యసేవలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి ప్రత్యేక అధికారులను బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాకు సూచించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలతో పాటు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి రోగికి రూ.250 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతువేదికలను ఐసొలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా రోగులు ఎవ్వరూ హైదరాబాద్ వెళొద్దని, జిల్లాలోనే అవసరమైన వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. సోమవారం లోగా జోగిపేట, పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో 70 చొప్పున ఆక్సిజన్ పడకలను సిద్ధం చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. దవాఖానలకు ఆక్సిజన్, మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే డ్రగ్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి హరీశ్రావు జిల్లాలో కరోనా పరిస్థితి గురించి డీంఎహెచ్వో, డీసీహెచ్ఎస్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 14395 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 4793 మంది హోం ఐసొలేషన్లో ఉన్నట్లు డీఎంహెచ్వో గాయత్రీదేవి మంత్రికి వివరించారు. పీహెచ్సీల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ర్యాపిడ్ టెస్టు కిట్లు అందుబాటులో ఉన్నాయని, వ్యాక్సిన్ కోసం ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. డీసీహెచ్ఎస్ సంగారెడ్డి ఐదు ఏరియా దవాఖానల్లో కొవిడ్ రోగులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్వో మంత్రికి వివరించారు. జోగిపేటలో ఆక్సిజన్ సమస్య ఉన్నట్లు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై మంత్రి హరీశ్రావు దవాఖాన సూపరింటిండెంట్ శంకర్ను ప్రశ్నించగా, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. సోమవారంలోగా ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను బాగు చేసి 70 పడకలకు ఆక్సిజన్ అందేలా చూడాలని మంత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. జోగిపేట దవాఖానలో రెమిడెసివిర్ ఇంజక్షన్తో పాటు అన్ని మందులు అందుబాటులో ఉంచాలన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడారు. దవాఖానల్లో వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే వెంటిలేటర్లు బాగు చేయించాలని సూపరింటిండెంట్ను ఆదేశించారు. పటాన్చెరు ఏరియా దవాఖానలో కొవిడ్ రోగుల కోసం 70ఆక్సిజన్ పడకలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో మరుగుదొడ్ల సమస్య ఉందని సూపరింటిటెండెంట్ తెలుపగా.. మంత్రి మాట్లాడుతూ.. వెంటనే కొత్తవి నిర్మించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షాకు సూచించారు. సదాశివపేట దవాఖానలో కొవిడ్ రోగుల కోసం 50 ఆక్సిజన్ పడకలు, నారాయణఖేడ్ దవాఖానలో 70 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేయాలని డీసీహెచ్ఎస్కు సూచించారు. దవాఖానలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టును వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సూచించారు. రెమిడెసివిర్ కొరత లేకుండా జిల్లాలోని మైలాన్, హెటేరో, రెడ్డిల్యాబ్, సిప్లా ఫార్మాకంపెనీల నుంచి సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
ఎంపీ బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. సంగారెడ్డిలోని దవాఖానలో ఉన్న 20 వెంటిలేటర్లను వెంటనే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వెంటిలేటర్ల బిగింపు అత్యవసరం ఉన్నందున ప్రైవేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సకు పెద్ద ఎత్తున బిల్లులు వేస్తున్నారని, దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ప్రైవేట్ దవాఖానల్లో అందించే వైద్యసేవలు, చార్జీల వివరాల బోర్డులను దవాఖాన వెలుపల ఉంచేలా చూడాలని వైద్య అధికారులను ఆదేశించారు.
వ్యాక్సిన్ పంపిణీలో ప్రజాప్రతినిధులను భాగప్వామ్యం చేయాలి..
కరోనా ముప్పు నుంచి తప్పుకోవడానికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్ల అందుబాటు, సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ మరింత ముమ్మరంగా సాగాలంటే ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతి సర్పంచ్కు రోజుకు 20 మందికి వ్యాక్సిన్ వేయించేలా చూస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాతరలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. జాతరలు జరుగకుండా చూడాలని ఎస్పీ చంద్రశేఖర్కు సూచించారు.
ప్రత్యేక అధికారులు వీరే..
జిల్లాలోని ఐదు ఏరియా దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు మంత్రి హరీశ్రావు ప్రత్యేక అధికారులను నియమించారు. సంగారెడ్డి దవాఖాన ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ రాజర్షి షా, జోగిపేట దవాఖాన ప్రత్యేక అధికారిగా ఆర్డీవో నగేశ్, జహీరాబాద్ దవాఖాన ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రమేశ్బాబు, నారాయణఖేడ్ దవాఖాన ప్రత్యేక అధికారిగా ఆర్డీవో అంబదాసు రాజేశ్వర్, పటాన్చెరు ఏరియా దవాఖాన ప్రత్యేక అధికారిగా డీసీవోను నియమించారు. వీరంతా సోమవారం నుంచి తమకు అప్పగించిన ఏరియా దవాఖానల్లో కరోనా వైద్యసేవలు, వ్యాక్సినేషన్ తీరును పర్యవేక్షించనున్నారు.