జిల్లా వ్యాప్తంగా 350 బెడ్స్తో రెండు దవాఖానలు సిద్ధం
అగ్ని ప్రమాద నిరోధక పరికరాల ఏర్పాటుపై తనిఖీలు
వికారాబాద్, మే 1 , (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందిచేందుకు 350 బెడ్స్తో రెండు కొవిడ్ దవాఖానలు సిద్ధం చేశారు. 20 పడకలకు పైగా ఉన్న ప్రైవేట్ దవాఖానలు జిల్లాలో 20 ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు ఆశ కార్యకర్తలు కొవిడ్పై పోరాటం చేస్తున్నారు. మెడికల్, రెవెన్యూ శాఖతో పాటుగా పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేస్తున్నారు. జిల్లా పరిధిలో మహావీర్ ఆసుపత్రిలో 150 పడకలు, సాయి డెంటల్ కళాశాలలో 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. టీబీ, మహావీర్ దవాఖానల్లో ఐసోలేషన్ వార్డులు ఉన్నాయి. ఇక్కడ వెంటిలేటర్ల వసతి కూడా కల్పించారు. అలాగే తాండూరు ఆసుపత్రిలో 50 పడకలకు అదనంగా మరో 50 పడకలను బాధితుల కోసం సిద్ధం చేశారు. విమెన్ చైల్డ్ కేర్ సెంటర్లో 50 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. పాజిటివ్ వస్తే హైదరాబాద్కు వెళ్లకుండా స్థానికంగా చికిత్సలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం జిల్లా ప్రజలకు సూచించారు.
దవాఖానలను సందర్శిస్తున్న అగ్నిమాపక అధికారులు..
కొవిడ్ ఐసోలేషన్ వార్డులున్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అగ్నిమాపక సిలిండర్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆదేశాలతో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నేతృత్వంలో జాగ్రత్తలపై మార్గదర్శకాలను విడుదల చేశారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో ఏఏ పరికరాలు ఉండాలో పరిశీలించి తగిన తోడ్పాటు అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి అగ్నిమాపక శాఖను కోరింది. దీంతో జిల్లాలోని కొవిడ్ ఐసోలేషన్ దవాఖానల్లో పరిశీలన చేసేందుకు స్థానిక అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలి దశ కరోనా సమయంలోనూ అగ్నిమాపక శాఖ అధికారులు ప్రభుత్వ దవాఖానలను సందర్శించి సూచనలు చేశారు. పరికరాలను సమకూర్చుకోవాల్సిన పద్ధతులు, సూచనలు చేశారు.