న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో భారత్ పోరాడుతున్నది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో పలు దేశాలు ముందుకు వచ్చి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వంద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా.. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి భారత్ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది. 400కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు ఒక మిలియన్ ర్యాపిడ్ కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఇతర పరికరాలతో, సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్పోర్టర్ ఇవాళ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో దిగింది.
ఈ మేరకు యూఎస్ ఎంబసీ భారతదేశానికి తాము సహాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు సహాయం అందిస్తున్నామని, సహాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ‘యునైటెడ్ స్టేట్స్ నుంచి అనేక అత్యవసర కొవిడ్-19 సహాయక సరుకులలో మొదటిది భారతదేశానికి చేరుకుంది. 70 సంవత్సరాల పరస్పర సహకారంతో, యునైటెడ్ స్టేట్స్ భారతదేశంతో నిలుస్తుంది. మేము సమిష్టిగా కొవిడ్-19 మహమ్మారితో పోరాడుతాం’ అంటూ ట్వీట్ చేసింది. #USIndiaDosti అంటూ యూఎస్ ఎంబసీ హ్యాష్ట్యాగ్ ఇచ్చింది.
అమెరికా నుంచి వచ్చిన వాటిల్లో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 1.50కోట్ల ఎన్-95 మాస్కులు, పది లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ముడి సరుకు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూఎస్ లోని వివిధ కంపెనీలు మరియు వ్యక్తులు విరాళంగా ఇచ్చే పరికరాలను కూడా తీసుకువచ్చే ప్రత్యేక విమానాలు వచ్చే వారంలో కూడా కొనసాగుతాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భారతదేశానికి నిరంతర మద్దతు ప్రకటించారు. ‘అమెరికాలో వైరస్ విజృంభించిన సమయంలో భారత్ మా పక్షాన నిలబడింది. ఇప్పుడు భారత్కు అవసరం వచ్చింది. మేం భారత్ పక్షాన నిలబడాలనే దృడ సంకల్పం తీసుకున్నాం’ అని బైడెన్ పేర్కొన్నారు.