కరోనాపై అపోహలు వద్దు
వ్యాక్సిన్ వేయించుకున్నా నిబంధనలు పాటించాలి
మెరుగైన చికిత్స అందిస్తున్నాం
విద్యానగర్, ఏప్రిల్ 28: కరోనా విషయంలో ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందుతున్నారని, అనవసరంగా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని కరీంనగర్జిల్లా కేంద్రంలోని సీవీఎం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్చాట్ల పేర్కొన్నారు. బుధవారం ఆయన కొవిడ్ చికిత్సా విధానం, వ్యాక్సినేషన్, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే’కు వివరించారు. 100 పడకలు గల సీవీఎం హాస్పిటల్లో 24 గంటల పాటు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది, ఐసీయూ, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా కరోనా బాధితులకు చికిత్స అందించామన్నారు. వ్యాధి భయంతోనే ఎక్కువ మంది ప్రజలు మరణిస్తున్నారన్నారు.
గర్భిణులకు వ్యాక్సిన్పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫారసు చేయలేదు. వీరి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రెండు టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి..
కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. సెంటర్లలో ఏది అందుబాటులో ఉంటే అదే తీసుకోవాలి. వైరస్ను ఎదుర్కోవడంలో రెండు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. టీకా తీసుకునేముందు లక్షణాలుంటేనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి.
6-8 వారాల్లోగా బూస్టర్ డోస్ తీసుకోవాలి..
మొదటి డోస్ టీకా వేసుకున్న తర్వాత సాధారణంగా 28 రోజుల తర్వాత బూస్టర్ (రెండో) డోస్ తీసుకోవాలి. ఒకవేళ వీలుకాకుంటే 6-8 వారాల్లోగా తీసుకున్నా సరైన ఫలితం ఉంటుంది. ఈ విషయంలో వదంతులను నమ్మవద్దు.
ఏ టీకా తీసుకున్నా దుష్ప్రభావాలు సహజం..
ఏటీకా తీసుకున్నా కొన్ని దుష్ప్రభావాలుంటాయి. కొందరికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. వచ్చినా రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు.
రెండు డోసులు తీసుకున్నా నిబంధనలు పాటించాలి..
కొంతమంది రెండు డోస్లు తీసుకున్నా మాస్క్ వాడనక్కర్లలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. కచ్చితంగా నిబంధనలు పాటించాలి. మాస్క్లు ధరించడంతోపాటు నిర్ణీత దూరం పాటించాలి. శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలి.
టీకా తీసుకున్నా వైరస్ సోకుతుంది..
టీకా తీసుకున్న వారికి కూడా కరోనా సోకవచ్చు. కానీ, దాని తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. అయితే వీరి ద్వారా ఇతరులకు వైరస్ సంక్రమించే ముప్పు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు వ్యాక్సిన్ వేసుకునే ముందు, తర్వాత ఎలాంటి మందులు ఆపకుండా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు.
ప్రత్యేకమైన డైట్ అవసరం లేదు..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆహార నిబంధనల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. రెండు డోసులు తీసుకునే వరకు ఎలాంటి ప్రత్యేక డైట్ అవసరం లేదు. అన్ని ఆహార పదార్థాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆల్కహాల్కు దూరంగా ఉండడం మంచిది. కరోనా నేపథ్యంలో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆహారం, వ్యాయామం, యోగాలాంటివి తప్పనిసరిగా చేయాలి.
రెండు డోసుల్లో ఒకే టీకా వేసుకోవాలి..
మొదటి డోస్ ఒక టీకా, రెండో డోస్లో మరో టీకా వేసుకోవడం మంచిది కాదు. కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే రెండు డోసుల్లోనే ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే వేసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా వస్తే కోలుకున్న రెండు వారాలకు రెండో డోస్ తీసుకోవచ్చు. అదే మొదటి డోస్ తీసుకోకముందు కరోనా వస్తే రికవరీ అయిన 28 రోజుల తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి.