నాసిక్/ముంబై, ఏప్రిల్ 21: మహారాష్ట్రలోని నాసిక్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగుల ప్రాణాలు కాపాడాల్సిన దవాఖానయే మృత్యుపాశం విసిరింది. ప్రాణవాయువు అందక రోగులు విలవిలలాడుతూ విగతజీవులయ్యారు. చూస్తుండగానే ఒకరి తర్వాత మరొకరు పిట్టల్లా రాలిపోయారు. నాసిక్లోని జాకిర్ హుస్సేన్ మున్సిపల్ దవాఖానలో బుధవారం ఆక్సిజన్ సరఫరాలో అంతరాయంతో 24 మంది కరోనా రోగులు మరణించారు. స్టోరేజ్ ప్లాంట్లో ఆక్సిజన్ లీక్ కావడంతో రోగులకు ప్రాణవాయువు సరఫరాలో విఘాతం కలిగింది. మృతులందరూ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నవారే. 22 మంది వెంటనే మరణించగా, మరో ఇద్దరు సాయంత్రం మృతిచెందారు. మృతుల్లో పురుషులు, మహిళలు దాదాపు సమానంగా ఉన్నారు. ఈ దవాఖానలో మొత్తం 157 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 67 మందికి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్ సాకెట్ ఒకటి పగిలిపోయి లీకేజ్ కావడం మొదలైందని, దీన్ని 12.30 గంటల ప్రాంతంలో సిబ్బంది గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ సమయంలో ఒక ఆక్సిజన్ ట్యాంకర్ దవాఖానకు వచ్చిందని, దాంతో పాటు వచ్చిన టెక్నిషియన్లు, దవాఖాన టెక్నిషియన్లు కలిసి ట్యాంక్ వాల్వ్ను మూసివేసి ఆక్సిజన్ లీకేజ్ని ఆపగలిగారని అంటున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న మూడొంతులమంది పిట్టల్లా రాలిపోయారు. దీంతో దవాఖానలో తీవ్ర కలకలం రేగింది. దవాఖానలోకి ప్రజలు పెద్దెత్తున తరలివచ్చారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దవాఖానలో రెండు ఆక్సిజన్ ట్యాంకులను ఇటీవల ఏర్పాటు చేశారని, వాటి బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాటిలో ఒక ట్యాంకులోకి ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ నింపుతుండగా లీకేజ్ జరిగిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తామని మహారాష్ట్ర వైద్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మృతుల బంధువులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుభూతి తెలిపారు.
‘ఊపిరాడటం లేదని, సాయం చేయండని నర్సింగ్ సిబ్బందిని మా అమ్మ ప్రాధేయపడింది. కానీ వారు పట్టించుకోలేదు. విలవిలలాడుతూ కొద్దిసేపటికే మా అమ్మ కన్నుమూసింద’ని లీలా షెలార్ అనే మహిళ కన్నీరుమున్నీరైంది. ఆమె కరోనా సోకిన తన తల్లిని మంగళవారం ఈ దవాఖానలో చేర్పించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలతో దవాఖాన ప్రాంగణం ప్రతిధ్వనించింది. కోలుకుంటారనుకున్న తమ కుటుంబ సభ్యులు దవాఖాన వర్గాల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారని వారు ఆక్రోశించారు.