న్యూఢిల్లీ : దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109కు చేరగా.. 1,28,09,643 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 1,77,150 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది.
మరో వైపు కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకు 12,26,22,590 డోసులు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. రోజువారీ కొవిడ్ పరీక్షలు సైతం భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 15,66,394 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 26.65 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..