జనగామ : పట్టాదారు పాస్ పుస్తకం రావట్లేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. ఐలేని వెంకటయ్య (58)కు గ్రామంలో సర్వే నంబర్ 54, 55లో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అతడు 40-50 ఏండ్ల నుంచి వ్యవ సాయం చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో తన భూమి అన్న ఐలేని రామయ్య పేర పట్టాదారు పాసుపుస్తకం అయింది. ఎన్ని సార్లు అడిగినా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా ఫలితం లేకపోయింది. రామయ్య తప్పించుకుని తిరిగాడు తప్ప వెంకటయ్య పేరు మీద పాసు పుస్తకం చేయలేదు. దీంతో వెంకటయ్య పలు మార్లు ఆర్డీవో, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
రైతుబంధు డబ్బులు పోతున్నాయి.. పట్టాదారు పాసుపుస్తకం వస్తలేదని మనస్తాపం చెందిన వెంకటయ్య గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు