లక్ష లడ్డూలు, 100క్వింటాళ్ల తలంబ్రాలు తయారీ
పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులు
రామయ్య ఆదాయం 14, సీతమ్మ ఆదాయం 5
భద్రాచలం, ఏప్రిల్ 13: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్లవ నామ సంవత్సర (ఉగాది) వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను మంగళవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉగాది సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు, ఉత్సవ, నిత్య కల్యాణమూర్తులకు, పరివార దేవతలకు, ఏకాంత తిరుమంజనం జరిపారు. రామయ్యను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు వేపపువ్వు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఏప్రిల్ 21న శ్రీరామ నవమి, 22న రామయ్యకు పట్టాభిషేకం జరిపించనున్నారు. శ్రీరామ నవమి, పట్టాభిషేకం సందర్భంగా లక్ష లడ్డూలు, 100 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు.
పంచాంగ శ్రవణం..
సాయంత్రం 4 గంటలకు ఆరాధన, 5 గంటలకు రాజ దర్బారు సేవ, 6 గంటలకు 101 పంచాంగాలకు సరస్వతి పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన జరిపారు. అనంతరం దేవస్థానం వేద పండితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని పంచాంగ శ్రవణం చేశారు. ప్లవ నామ సంవత్సరంలో సీతారాములకు ఆదాయ, వ్యయాలను తెలిపారు. రామయ్యకు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, సీతమ్మకు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా చెప్పారు. అలాగే పంటలు ఓ మోస్తరుగా పండుతాయని, 16 భాగాలు పంటలు పండితే అందులో 7 భాగాలు మాత్రమే చేతికి వస్తాయని వివరించారు. వర్షం సముద్రంలో 9 భాగాలు, పర్వత ప్రదేశాల్లో 9 భాగాలు, భూమిపై 9 భాగాలు పడుతుందన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఈ ఏడాది నుంచి తగ్గుముఖం పడుతుందన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే దైవానుగ్రహం కావాలని, అందుకు రామనామాన్ని జపించడమే తారకమంత్రమని, స్వీయ రక్షణ కూడా అవసరమని అన్నారు. దేవస్థానం పర్యవేక్షకులు భవానీ రామకృష్ణ వేద పండితులకు, దేవస్థానం అర్చకులకు, బ్రాహ్మోణోత్తములకు కొబ్బరి బొండాలు, పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు.