బ్యాంకు రుణం రికవరీ విషయంలో నిక్కచ్చిగా ఉండాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పీఏసీఎస్ల చైర్మన్లకు చెక్కుల పంపిణీ
సుబేదారి, ఏప్రిల్ 10 : ప్రతి సహకార సంఘా న్ని లాభాల్లోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 44 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మల్టీపర్సస్ బిజినెస్ కోసం నాబార్డు రుణ సాయంతో బ్యాంకు చెక్కులను చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి సొసైటీ చైర్మన్లు, సీఈవోలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరిపెడ నుంచి వరంగల్ వరకు రోడ్ల వెంట ఎక్కడచూసినా పచ్చని పైర్లతో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయన్నారు. 24గంటల కరంట్, పంట పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు భరోసా ఇవ్వడం వల్ల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు మారిపోయాయ్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రైతులు తిరిగి సకాలంలో చెల్లించే పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. సొసైటీ చైర్మన్ నుంచి తన రాజకీయ జీవితం మొదలైందని డీసీసీబీ చైర్మన్గా కూడా పనిచేసినట్లు మంత్రి తెలిపారు. ఆ సమయంలో తన కుటుంబసభ్యులకే నోటీస్ ఇచ్చి లోన్ రికవరీ చేయించానని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన వద్దకు లోన్లు కావాలని ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వచ్చేవారని రైతులకు నిస్వార్థంతో సేవ చేయడం వల్ల మంచి పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు.
అప్పుడు ఎన్టీఆర్ అప్కాబ్ చైర్మన్ ఇస్తానని చెప్పి, కొన్ని కారణాలతో ఇవ్వలేదన్నారు. ఉద్యోగుల జీతాభత్యాలు పెంపు, డీసీసీబీ, పీఏసీఎస్ల అభివృద్ధి విషయంలో తాను ముందుంటానని అన్నారు. అలాగే రవీందర్రావు పాలకవర్గం, ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఏడాదికాలంలో బ్యాంకుకు రూ.7కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా రికవరీ శాతాన్ని 7నుంచి 3 శాతానికి తీసుకురావడం, కొత్తగా 8 శాఖలు ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు. రికవరీ విషయంలో నిక్కచ్చిగా ఉన్నప్పుడే బ్యాంకు పురోగతి సాధిస్తుందని ఈమేరకు చొరవ తీసుకోవాలని సొసైటీ చైర్మన్లకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో ముందువరుసలో ఉన్న కరీంనగర్ డీసీసీబీకి దీటుగా మన సంఘాలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. బ్యాంకు పురోగతిపై ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్ సంతోషం వ్యక్తంచేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాబార్డు ఎండీ మురళీధర్, డీసీసీబీ సీఈఓ చిన్నారావు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొసైటీ సిబ్బందికి ఉద్యోగ భద్రత
రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నా రు. వరంగల్ డీసీసీబీ ఎప్పడూ లేనివిధంగా ఏడాదికాలంలో 35శాతం పురోగతి సాధించిందని, మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రలో సహకార వ్యవస్థ చాలా పటిష్టంగా నడుస్తుందని, మన రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల విక్రయాలతో బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి
సామాజిక దార్శనికుడు జ్యోతిరావు పూలే