తిరుమల : సుందరకాండ అఖండ పారాయణంతో తిరుమల గిరులు మార్మోగాయి. విశ్వంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న మహామంత్ర పారాయణం విజయవంతంగా పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టాలని, లోక కల్యాణార్థం టీటీటీ నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞం నేటికి (ఏప్రిల్ 10వ తేదీ) సుందరకాండ పారాయణం 304 రోజులు పూర్తి చేసుకుందన్నారు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని సుందరకాండ పారాయణంతో బుద్ధి, బలం, ధైర్యం కలిగి సకల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయని తెలిపారు. గొప్ప ఉద్దేశంతో ఏడాది పాటు చేపట్టిన మహామంత్ర పారాయణంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. సుందరకాండ పారాయణం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగింది. సుందరకాండలోని 49వ సర్గ నుంచి 53వ సర్గ వరకు ఉన్న 155 శ్లోకాలను అఖండ పారాయణం చేశారు. జాతీయ సంస్కృత వర్సిటీ అధ్యాపకులు ఆచార్య బాల సుబ్రహ్మణ్యం ‘ఏమయ్య రఘు రామయ్య’ సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం ‘పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు’ సంకీర్తనతో ముగించారు. పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అద్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు 200 మంది పాల్గొన్నారు.