కూసుమంచి రూరల్, ఏప్రిల్ 8: మండలంలోని కిష్టాపురంలో కన్న బిడ్డల ఆదరణకు నోచుకోకుండా జీవచ్ఛవంలా మారిన కంచర్ల మంగమ్మకు జిల్లా న్యాయసేవా సంస్థ చేయూతనందించింది. ఇదే గ్రామానికి చెందిన డీజీపీ మహేందర్రెడ్డి కూడా స్పందించి సహాయపడ్డారు. వృద్ధురాలి దీన స్థితిపై ‘అమ్మ దీనావస్థ’ శీర్షికన ఈనెల 7న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయా శాఖల అధికారులు స్పందించారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి. న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ జావీద్పాషా గురువారం గ్రామానికి చేరుకొని వృద్ధురాలు కంచర్ల మంగమ్మతో మాట్లాడారు. ఆమె పరిస్థితికి చలించిన న్యాయమూర్తి న్యాయసేవా సంస్థ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆమె పిల్లలను పిలిపించాలని స్థానిక ఎస్సై ఇంద్రసేనారెడ్డిని ఆదేశించారు. తల్లికి న్యాయం జరిగేలా సహకరిస్తామని ఆయన అన్నారు. వృద్ధురాలిని సఖి కేంద్రానికి తరలించి తగిన వైద్య సేవలందించాలని అన్నం ఫౌండేషన్ ప్రతినిధి, పారాలీగల్ వలంటీర్ అన్నం శ్రీనివాసరావును కోరారు. వెంటనే ఆమెను ఖమ్మంలోని సఖీ కేంద్రానికి తరలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బాలాత్రిపురసుందరి, సర్పంచ్ పందిరి పద్మ, అన్నం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
స్పందించిన డీజీపీ..
నిస్సహాయస్థితిలో ఉన్న కంచర్ల మంగమ్మ పరిస్థితిని తెలుసుకున్న ఇదే గ్రామానికి చెందిన డీజీపీ ముదిరెడ్డి మహేందర్రెడ్డి వెంటనే స్పందించారు. ఆమె పరిస్థితి గురించి ఎస్బీ, స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. మంగమ్మను ఆదుకోవడానికి కొంత నగదును పంపించారు. ఆమెకు తగిన వైద్యసాయం చేయించాలని అన్నం ఫౌండేషన్ ప్రతినిధులను కోరారు.