ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8: ఎడపల్లి మండలంలో పలు శాఖల అధికారుల తీరు కారణంగా తమకు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎడపల్లిలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు అందుబాటులో ఉండ డం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తితే తాము సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తూ సదరు శాఖ ఏఈపై ఎంపీటీసీలు షేక్ జావీద్, కుర్నాపల్లి ఎంపీటీసీ రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా మోటర్లు బిగించారంటూ ఆకస్మికంగా గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం వేయించిన బోర్ల కనెక్షన్లను విద్యుత్శాఖ అధికారులు తొలగించడంతో పంచాయతీల ఎదుట ప్రజలు ఆందోళన చేసే పరిస్థితి నెలకొందన్నారు. ముందుగా ఈ విషయాన్ని సర్పంచులకు, కార్యదర్శులకు సమాచారం అందించకుండా ఎలా తొలగిస్తున్నారంటూ విద్యుత్శాఖ ఏఈని ప్రజాప్రతినిధులు నిలదీశారు. మండలంలో నిర్మించిన భవనాలను ఆయా శాఖలకు అప్పగించాలని పలువురు సభ్యులు అధికారులకు సూచించారు.
వివాదానికి దారితీసిన పాత చెక్కుల పంపిణీ..
ఎడపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో గత ఏడాది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెక్కులను మూడు రోజుల క్రితం పంపిణీ చేసిన విషయం మండల సమావేశం ముగింపు సమయంలో వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన సర్పంచ్కు సమాచారం లేకుండా ఎలా పంపిణీ చేశారని నెహ్రూనగర్కు చెందిన సర్పంచ్ అమానుల్లా షరీఫ్ ఎంపీడీవో శంకర్ను ప్రశ్నించారు. దీంతో ఎంపీపీ శ్రీనివాస్ ఈ విషయంలో పాత చెక్కుల కారణంగా చెప్పలేదని, చెప్పాల్సిన అవసరం లేదని అనడంతో వివాదానికి దారితీసింది. సర్పంచులకు సమాచారం లేకుండా కార్యక్రమాలు ఎలా చేపడతారని అమానుల్లా షరీఫ్, అంబం(వై) సర్పంచ్ గంగాప్రసాద్ ఎంపీడీవోను నిలదీశారు. కాగా, ఇలాంటి పొరపాట్లు మరోమారు కాకుండా చూస్తామని, ఎంపీడీవో శంకర్ సదరు నాయకులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరోనా నిబంధనలు పాటించాలి
గ్రామాల వారీగా కరోనా వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని బోధన్ ఏసీపీ రామారావు సూచించారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ సహకారంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, మాస్క్లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు చేపట్టాలని, మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని ఆయన సూచించారు. ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్, సూపరింటెండెంట్ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, బోధన్ రూరల్ సీఐ రవీందర్నాయక్, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
ముకేశ్పై ఫైన్కు వ్యతిరేకంగా శాట్కు రిలయన్స్!
10 చెక్డ్యాంలు..11 వేల ఎకరాలు