కొత్త తూము షెట్టర్ ఊడి 6 రోజులైనామరమ్మతులు చేపట్టని ఐబీ అధికారులు
వృథాగా పోతున్న సాగునీరు
కోట్లాది రూపాయల నిధులు నీళ్ల పాలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 5 : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నీటి పారుదలశాఖ అధికారుల అలసత్వంతో వరంగల్ రూరల్ జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన నర్సంపేట మండలం మాదన్నపేట చెరువుకు ప్రమాదం పొంచి ఉంది. రెండేళ్ల క్రితం కాంట్రాక్టర్ నిర్మించిన కొత్త తూము షెట్టర్ ప్రస్తుతం ఊడిపోయింది. షెట్టర్ ఊడి దాదాపు ఆరు రోజులు కావస్తున్నా అధికారులు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. వారి పట్టింపులేమితో కోట్లాది రూపాయల నిధులు నీళ్ల పాలవుతున్నాయి. అంతేగాక చెరువు కట్ట మొత్తం గండ్లతో నిండి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళనలో ఆయకట్టు రైతులు ఉన్నారు. మండలంలోని మాదన్నపేట చెరువు కింద అధికారికంగా, అనధికారికంగా సుమారు 3,500 ఎకరాలు ప్రతి ఏటా సాగవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 2016 మేలో ఈ చెరువు అభివృద్ధికి రూ.7.50కోట్ల నిధులు మంజూరు చేసింది. అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా రాష్ట్రంలోనే అతిపెద్దదైన మిషన్ కాకతీయ పైలాన్ను మాదన్నపేట చెరువుకట్టపై ఆవిష్కరించారు. మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ కాంట్రాక్టును మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దక్కించుకున్నాడు. 2016 నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్ అడపాదడపా పనులు చేశాడు. ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్ రూ.6.50కోట్ల వరకు రికార్డు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
అప్పట్లో చెరువుకట్టపై అక్కడక్కడా కొంత మట్టి పోసి చదును చేశాడు. రెండు తూములు, రెండు మత్తళ్లు నిర్మించాల్సి ఉండగా ఒక్క తూము, మత్తడితోనే సరిపుచ్చారు. కాకతీయుల కాలంలో వేసిన తూము స్థానంలో ఈ దఫా కొత్త తూము, షెట్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అవేమీ పట్టని సంబంధిత కాంట్రాక్టర్ ఐబీ అధికారుల అండదండలతో పాత తూముకే మరమ్మతులు చేపట్టాడు. మినీ ట్యాంక్ బండ్లో భాగంగా చెరువు కట్టపై ఆహ్లాదకరమైన పార్కు, బీటీ రోడ్డు, అదనంగా పిల్లల పార్కు, కట్ట పొడవునా లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కనీసం ఇప్పటివరకు బీటీ రోడ్డు కూడా వేయలేదు. దీంతో వర్షాకాలంలో మట్టి రోడ్డంతా బురదమయంగా మారుతున్నదని ప్రజలు చెబుతున్నారు. రెండు సంవత్సరాల క్రితమే మాదన్నపేట చెరువు కట్టకు భారీ బుంగ పడింది. అప్పట్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పందించి వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి చెరువు కట్టపై ఉండి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో బుంగను పూడ్పించి భారీ ప్రమాదం నుంచి బయటపడవేశారు. కొత్త తూము షెట్టర్కు మరమ్మతు చేయించారు. కానీ సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోలేదు.
చెరువు కట్టంతా గండ్లే…
గతంలో కురిసిన వర్షాలకు మాదన్నపేట చెరువు కట్టకు గండ్లు పడ్డాయి. ప్రస్తుతం ఇవి ప్రమాదకరంగా తయారయ్యాయి. కోట్లాది రూపాయల నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా కట్ట వెడల్పు పనులు చేపట్టాడు. కట్ట నిర్మాణం సక్రమంగా చేపట్టలేదు. ఈ చెరువు కింద దుబ్బకాల్వ, పెద్ద కాల్వ, మిట్టకాల్వ ద్వారా పంట పొలాలకు సాగు నీరు అందిస్తారు. చెరువు కింద ఉన్న పెద్ద కాల్వ శిథిలావస్థకు చేరుకుంది.
ఊడిన కొత్త తూము షెట్టర్…
రెండు సంవత్సరాల క్రితమే చెరువుకు ఉన్న పాత తూము స్థానంలో కొత్త తూముతో పాటు షెట్టర్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా పాత తూము, షెట్టర్కే మరమ్మతులు చేయించాడు. దీనిపై సంబంధిత డీఈని ఆయకట్టు రైతులు ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. పాత తూము, షెట్టర్ను అలాగే ఉంచి ముందు భాగంలో దానికి ఆనుకొని మరో తూము, షెట్టర్ను ఏర్పాటు చేశాడు. పాత తూము నుంచే నీరు చెరువు కింద ఉన్న కాల్వలకు వెళ్లేలా చేశారు. కాగా, 6 రోజుల క్రితం కొత్త తూము షెట్టర్ ఊడిపోయింది.
ఈ విషయాన్ని సిబ్బంది ఐబీ అధికారులకు చేరవేశారు. ప్రస్తుతం కొత్త తూము షెట్టర్ ఊడిపోవడం వల్ల నీరంతా పాతతూము షెట్టర్ నుంచి వెళ్తున్నది. ఈ తూము షెట్టర్ కాకతీయుల కాలం నాటిది కావడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. అంతేగాక పాతతూము లోపలి భాగమంతా కూలిపోతుందని ఆయకట్టు రైతులు అంటున్నారు. కట్టకు ఎప్పుడు బుంగపడుతుందో…లేదా కట్ట ఎప్పుడు కోతకు గురవుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఐబీ డీఈ, ఏఈలు చెరువు కట్టను పరిశీలించలేదు. తక్షణమే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఊడిపోయిన కొత్త తూము షెట్టర్కు మరమ్మతులు చేపట్టడంతో పాటు పాత తూము షెట్టర్ను తొలగించి కొత్తది నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..