సిద్దిపేట కలెక్టరేట్, మార్చి 30 :ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పద్మాకర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మొదటి ప్రాధాన్యత కల్పించాలని సమీక్షించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారని కలెక్టర్ తెలిపారు. నేడు జిల్లా కేంద్రమైన సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ధాన్యం కొనుగోళ్లపై మండలస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. పంట విక్రయాలకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు.
అనంతరం కరోనాపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో కరోనా తీవ్రతపై వైద్యాధికారులు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ వచ్చి మృతి చెందిన రోగుల వివరాలను తనకు ఎప్పటికప్పుడూ అందించాలని జిల్లా వైద్యాధికారి మనోహర్కు సూచించారు. గడిచిన మూడు నెలల్లో జిల్లాలో కరోనా తీవ్రతపై వైద్యాధికారులతో చర్చించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ధరణి పోర్టల్ సేవలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కొవిడ్-19 అంశాలపై జిల్లా పురోగతిని సీఎస్కు వివరించారు. ఆయా సమావేశాల్లో ఆర్టీవోలు విజయేందర్రెడ్డి, జయచంద్రారెడ్డి, డీపీవో సురేశ్బాబు, డీఏవో శ్రవణ్కుమార్, డీఎస్వో హరీశ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు పాల్గొన్నారు.
ధరణిలో జిల్లా ఆదర్శం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్సైట్ను అమలు చేయడంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. ధరణి అమలులో తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ధరణి వెబ్సైట్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను, భూ వివాదాలు వాటి పరిష్కారానికి జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టాల్సిన విధి విధానాలపై అదనపు కలెక్టర్ పద్మాకర్, డీఆర్వీ చెన్నయ్య, ఆర్టీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఫార్మాట్ 1, 2, 3 రూపంలో నివేదికలు తెప్పించుకొని సమస్యాత్మక అంశాలను పరిగణనలోనికి తీసుకొని వాటిని ప్రభుత్వానికి తెలిసేలా కలెక్టరేట్లో ధరణిపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
పల్లెల ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు. పల్లెప్రగతి, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, హరితహారం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ధరణి పోర్టల్, వరిధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ సూచనలతో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. 6నెలల్లో మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధ చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రోనార్డ్రోస్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు, ఎక్సైజ్శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, సీఎంవో ప్రియాంకవర్గీస్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
షాకింగ్ సర్వే : మెల్లిగా నడిచేవారిలో కొవిడ్-19 ముప్పు అధికం