జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ
హాజరైన కలెక్టర్, సీపీ, అధికారులు
కొత్తపల్లి, మార్చి 24 : యువతలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకే ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫ్రీడం రన్ను కలెక్టరేట్లోని హెలిప్యాడ్ పార్కులో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. రన్ కలెక్టరేట్ మీదుగా ప్రతిమ మల్టీప్లెక్స్, తెలంగాణ చౌక్, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని యువతలో నింపేందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో మొదటగా 3.5 కిమీ ఫ్రీడం రన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఐక్యతకు మారుపేరని జిల్లా సాంస్కృతిక, సామాజిక, సంప్రదాయాలు కొనసాగించాలని కోరారు. సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, ఫ్రీడం రన్తో ఫిట్నెస్ పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్లాల్, ఏనుగు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, డీవైఎస్వో రాజవీరు, జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాస్రెడ్డి, పెటా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కడారి రవి, మిల్కూరి సమ్మిరెడ్డి, చంద్రశేఖర్, సమ్మయ్య, అంతడుపుల శ్రీనివాస్, ప్రకాశ్, సంతోష్, ఎన్సీసీ కేడెట్లు, క్రీడాకారులు, సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.