పూలసాగు.. లాభాలు బాగు
పుంజుకుంటున్న ధరలు
మూడు నెలలుగా భారీ డిమాండ్
తోటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్న రైతులు
షాద్నగర్, మార్చి21: అందమైన పూలు అన్నదాతల మోము ల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. పుంజుకుంటున్న ధరలతో లాభాల బాట పట్టిస్తున్నాయి. ఏడాది కాలంగా తీవ్ర నష్టాల్లో పూడుకుపోయిన పూల రైతులు, ధరలు క్రమంగా కోలుకుంటుండడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మూడు నెలల నుంచి ధరలు పెరుగుతూనే ఉండడంతో లాభాలు అర్జిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో రైతులు పూల తోటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల రైతులు పూలసాగుపై దృష్టిసారించారు.
పూలసాగులో రైతన్నలు
జిల్లాలోని 27 మండలాల్లో రైతులు తమకు అనువైనట్లు పూలతోటలు పెంచుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు పూలసాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర రాజధానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడం, అన్ని రోజుల్లో పూలకు డిమాండ్ ఉండడంతో సాగుపైన ఆసక్తి అధికమైంది. జిల్లాలో పండే పూలు ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేస్తున్నారు. కొత్తూరు, ఫరూఖ్నగర్, నందిగామ, కేశంపేట, కొందురు ్గ, అబ్దుల్లాపూర్మెట్, శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, బాలాపూర్, ఆమనగల్లు, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం, గండిపేట, హయత్నగర్, మాడ్గుల, షాబాద్, మొయినాబాద్ వంటి మండలాల రైతులు విస్తారంగా పూలు సాగుచేస్తున్నారు. సుమారు 4 వేల మంది రైతులకు పైగా నిత్యం పూలసాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. 6 వేల ఎకరాలకు పైగా భూ విస్తీర్ణంలో వివిధ రకాల పూల తోటలు సాగవుతున్నాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. చామంతి, బంతి, హస్టర్, జర్బరా, గులాబీ, హైబ్రీడ్ గులాబీ, కనకాంబురాలు, ముద్ద చామంతి పూల తోటలతో పాటు బొకే పిల్లర్ గ్రాస్, అస్పారస్ గ్రాస్, ఇతర డేకరేషన్ గ్రాస్, ఆకులు ఇక్కడి రైతులు పండిస్తున్నారు. రోజూ లక్షల విలువ చేసేలా రకరకాల పూలను గుడిమల్కాపూర్, జాంబాగ్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అస్పారస్ గ్రాస్ అనే డేకరేషన్ గడ్డి ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేస్తున్నారు.
పుంజుకుంటున్న ధరలు
కరోనా వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయిన పూల సాగు రైతులు ఇప్పుడిప్పుడే లాభాల వైపు అడుగులు వేస్తున్నారు. గతేడాది నవంబర్లో పడిపోయిన ధరలు కరోనాలో మరింత పతనమయ్యాయి. సాధారణ రోజుల్లోనూ పూలధరలు బాగానే ఉంటున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించడంతో పూల ఉత్పత్తి ఘణనీయంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో జర్బరా పూలకట్ట రూ.110 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది. కిలో గులాబీ రూ.160, గులాబీ పువ్వుల కట్ట రూ.150, కనకాంబరాలు కిలో రూ.300 నుంచి రూ. 450, లిల్లీ కిలో రూ.250 నుంచి 350, చామంతి కిలో రూ.180 నుంచి రూ. 200, అస్పారస్ గడ్డి కట్ట రూ.20 నుంచి రూ.30 ధర పలుకుతున్నాయి. వీటికి తోడు శుభకార్యాలకు, అలంకరణ, పూల బొకేలకు వినియోగించే పూల ధరలు భారీగా పెరిగాయి. మన ప్రాంతంలో పండే ముద్ద చామంతి, బంతి, టైగర్ రోజ్, ఆస్పారస్ గ్రాస్, లిల్లీ వంటి పూలు ఢిల్లీ, వైజాగ్, విజయవాడ, తిరుపతి, కడప, చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పూల రైతులకు పెరిగిన ధరలు ఊరటనిస్తుండడంతో గ్రామీణ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ పెరిగింది
చాలా రోజుల నుంచి ధరలు లేక ఇబ్బందులు పడ్డాం. నేను పంటను వదిలేసుకున్నా. మస్తు నష్టం వచ్చింది. 5, 6 నెలలు అయితే ఒక్క రూపాయీ రాలేదు. కనీసం పెట్టిన కూలీలు కూడా రాలేదు. ఈ రెండు, మూడు నెలల నుంచి ధర లు పెరిగాయి. దీంతో మళ్లీ ఆశ చిగురించింది. ఈయేడు భూ మిలో నీళ్లు కూడా పెరిగినవి. పూల సాగు బాగానే ఉంటుంది. – మల్లేశ్, పూల రైతు, చటాన్పల్లి, షాద్నగర్