కరీంనగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ ఓదెల : జాన పదుల నుంచి వచ్చినదే జాజిరి ఆట. తెలంగాణ సంస్కృతిలో భాగం. ఫాల్గుణ మాసంలో వచ్చే రంగుల హోలీకి ముందు ఈ ఆటను పల్లెలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. కులమతాలకతీతంగా ఆడుకుంటారు. ఒకప్పుడు ఈ ఆటకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కాముడి పౌర్ణమికి తొమ్మిది రోజుల ముందు నుంచే గ్రామాల్లో ప్రతి రోజూ సాయంత్రం సందడి మొదలయ్యేది. మగ పిల్లలు కోలలతో.. ఆడ పిల్లలైతే చప్పట్లతో పసందైన పాటలు పాడుతూ.. ఇంటింటికీ తిరుగుతూ.. వడ్లు, మక్కలతోపాటు డబ్బులూ తీసుకునేవారు. పిల్లలే కాకుండా యువకులు, నడి వయస్కులు కూడా ఆడేవారు. పౌర్ణమికి రెండు మూడు రోజుల ముందు ఊరు ఊరంతా తిరిగి కానుకలు సేకరించేవారు. ఇటు మహిళలు కూడా జట్లుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లే వారు. కాముడి దహనం వరకు జాజిరి ఆడేవారు. కోలలను కామున్ని దహించే మంటల్లో వేసేవారు. వచ్చిన డబ్బు, ఇతర కానుకలను పంచుకోవడమో.. లేదంటే హోలీ రోజు దావ త్ కోసమో ఖర్చు చేసే వారు. గతంలో ఇదంతా ఒక పండుగలా జరిగేది. ఈ ఆట ఎప్పుడు.. ఎక్కడ పుట్టిందో ఇదమిద్దంగా తెలియకున్నా తెలంగాణ సంస్కృతిలో మాత్రం ఇమిడి పోయింది. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం కాస్త వన్నె తగ్గినా పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.
చిలిపి పాటల చిత్రాలు..
పల్లెల్లో పాడుకునే జాజిరి పాటలు కొన్ని వందల్లో ఉండచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాటల్లో కష్టాలుంటాయి. కన్నీళ్లూ ఉంటాయి. సంతోషాలు, ఆనందాలూ ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో కొన్ని పాటల్లో భావాలు ఎంతో లోతుగా ఉంటాయి. ‘రింగుడు బిల్లా.. రూపాయి దండా.. దండకాదురా దామెర మొగ్గ..’ ఈ పాటలో హాస్యం, విజ్ఞానం కలగలిపి ఉంటుంది. మరో ప్రాచుర్యంలో ఉన్న పాట ‘కోతిపుట్టుడెందుకు.. కొమ్మలెక్కెతందుకు. కొమ్మలెక్కుడెందుకు’ ఇలా మొదలైన పాట ‘వాన కొట్టుడెందుకు.. వడ్లు వండెతందుకు.. వడ్లు వండుడెందుకు.. బువ్వ తినే తందుకు’తో ముగుస్తుంది. ఈ పాట పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. దేవుడు కరుణిస్తే వానలు కురుస్తాయని, వానలు కురుస్తే పంటలు పండుతాయని, పంటలు పండితేనే మనం బతుకగలుగుతామనే భావం ఇందులో ఉన్నది. ఇంకో పాట గురించి కూడా చెప్పుకోవచ్చు. ‘కట్ట పొంట కట్ట పొంట కర్రావువాయె.. కర్రావు కొమ్ముకు ఏమేంబాయె..’ ఈ పాట పశువులకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇలా కొన్ని వందల పాటలు తొమ్మిది రోజులు పల్లెలను ఉర్రూతలూగిస్తాయి. ఎలాంటి శిక్షణ లేకున్నా పిల్లలు ఈ పాటలను వారసత్వంగా స్వీకరించి కోలలు లయబద్ధంగా కొడుతూ.. పాడుతూ ఉంటే వినసొంపుగా అనిపిస్తాయి. మారుతున్న జనరేషన్కు తగినట్టు ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త పాటలను కూడా అక్కడక్కడా కైగడుతున్నారు.
అనాదిగా వస్తున్న ఆచారం..
జాజిరి ఆట చివరి రోజు గ్రామ కూడలిలో కామదహనం కార్యక్రమం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. డప్పుచప్పుళ్లతో కుమ్మరుల ఇంటికి వెళ్లి మట్టి కుండలను తీసుకు వస్తారు. అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కామదహనాన్ని ఘనంగా జరుపుకుంటారు. అందులో మగపిల్లలు కోలలు, ఆడపిల్లలు పిడకలు వేస్తారు. అలాగే గ్రామ మహిళలు కట్టెలు, పేడ, ఉనుకతో చేసిన పిడకలు వేసి కామదహనం చుట్టూ నీళ్లు పోస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ నెల 28న కామదహనం, 29న హోళీ పండుగ వస్తుండగా, ఇప్పటికే పల్లెల్లో జాజిరి ఆటలు మొదలయ్యాయి. ప్రతి రోజూ సాయంత్రం కోలల చప్పుళ్లతో జాన పదాలు గుబాళిస్తున్నాయి.