ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఇటీవల బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో ఉన్న వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ డిమాండ్ చేశారని పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్లోని క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్ అయిన సచిన్ వాజేను హోంమంత్రి గత కొన్ని నెలలుగా తన ఇంటికి పిలుపించుకున్నారని తెలిపారు. నెలకు వంద కోట్లు వసూలు చేయాలని తనకు టార్గెట్ ఉన్నదని, దీనికి సహకరించాలని వాజేకు హోంమంత్రి చెప్పారన్నారు.
ముంబైలో సుమారు 1,750 బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలు ఉన్నాయని, ఒక్కోదాని నుంచి 2-3 లక్షలు వసూలు చేసినా నెలకు 40 నుంచి 50 లక్షలు వసూలవుతాయని, మిగతా సోర్స్ నుంచి మరో 50 లక్షలు వసూలు చేయమని చెప్పారని పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. సచిన్ వాజే హోంమంత్రిని కలిసిన సందర్భాల్లో ఆయన వ్యక్తిగత కార్యదర్శి మిస్టర్ పలాండే కూడా ఉన్నారని పేర్కొన్నారు. మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు.
మరోవైపు పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఖండించారు. ముఖేష్ అంబానీ, మన్సుఖ్ హిరెన్ కేసులో సచిన్ వాజ్ ప్రమేయం ఉన్నందున తనను తాను రక్షించుకోవడానికి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నుంచి ఇది స్పష్టమవుతున్నదని తెలిపారు. ఇందులో పరంబీర్ సింగ్కు సంబంధం ఉన్నదని, దాని నుంచి తప్పించుకునేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.