సహచర ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ అరంగేంట్రంలోనే అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మొదటి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. కోహ్లీ మాస్టర్ క్లాస్కు.. రోహిత్ పవర్ హిట్టింగ్ తోడైన చందంగా కళాత్మక విధ్వంసంతో రెచ్చిపోయాడు. ఫలితంగా మొదట భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్ హిట్టర్లకు మూకుతాడు వేసి సిరీస్ను 2-2తో సమం చేసింది.
అహ్మదాబాద్: చావోరేవో మ్యాచ్లో కోహ్లీ సేన సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్లో మంచి స్కోరు చేసిన టీమ్ఇండియా.. అనంతరం బౌలింగ్లోనూ విజృంభించి సిరీస్ సమం చేసింది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో తీవ్ర చర్చకు దారితీసిన నాలుగో టీ20లో టీమ్ఇండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి. గురువారం పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. యువ ఆటగాడు సూర్యకుమార్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), రిషబ్ పంత్ (30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జాసన్ రాయ్ (40) పోరాడారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టీ20 శనివారం ఇక్కడే జరుగనుంది.
‘భారత అంపైర్ల చేతిలో టీమ్ఇండియా ఓటమి’.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అనంతరం సామాజిక మాధ్యమాల్లో కనిపించిన కామెంట్ ఇది. అంపైర్ల కారణంగా అప్పుడప్పుడు తప్పిదాలు జరగడం సహజమే అయినా.. ఈ మ్యాచ్లో కక్ష కట్టినట్లు ఒకటికి మూడు సార్లు అంపైర్లు టీమ్ఇండియాకు వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రకటించారు. అందులో ఒకటి దూకుడుమీదున్న సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపితే.. మరొకటి క్లిష్ట సమయంలో టీమ్ఇండియాకు ఆరు పరుగులను దూరం చేయడంతో పాటు వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయేలా చేసింది. ఇక మూడోది ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ స్టంపౌటైనా.. తిరిగి బ్యాటింగ్కు అనుమతించింది.
సామ్ కరన్ వేసిన పద్నాలుగో ఓవర్ రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్కు యత్నించగా.. డీప్ ఫైన్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న మలన్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. క్లీన్ క్యాచ్ పట్టాడా లేదా అనేది నిర్ధారించుకోకుండానే అంపైర్ సాఫ్ట్సిగ్నల్ ఔట్గా ప్రకటించి థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. క్యాచ్ పూర్తి కావడానికి ముందు మలన్ బంతిని నేలకు తాకించినట్లు టీవీ రిప్లేల్లో స్పష్టమైనా.. పలుమార్లు పరిశీలించిన తర్వాత ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని బలపరుస్తూ.. థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధశతకం బాదిన సూర్యకుమార్.. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా చూడచక్కటి షాట్లతో అలరిస్తున్న సమయంలో తప్పుడు నిర్ణయంతో ఔట్కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లోనూ అచ్చం ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. ఆర్చర్ వేసిన నాలుగో బంతికి సుందర్ ర్యాంప్ షాట్ ఆడగా.. థర్డ్మ్యాన్ ఫీల్డర్ రషీద్ క్యాచ్ పట్టాడు. ఈ సారి కూడా అంపైర్లు అత్యుత్సాహం ప్రదర్శించి మొదట సాఫ్ట్ సిగ్నల్ ఔట్గా ప్రకటించి ఆ తర్వాత థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. రిప్లేలో బంతి అందుకుంటున్న సమయంలో రషీద్ కాలు బౌండ్రీ లైన్కు తాకినట్లు కనిపిస్తున్నా.. సిక్సర్ ఇవ్వాల్సిన చోట అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మలన్ స్టంపౌటైనట్లు రిప్లేలో తేలినా.. థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించడం గమనార్హం.
భారత్: రోహిత్ (సి అండ్ బి) ఆర్చర్ 12, రాహుల్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 14, సూర్యకుమార్ (సి) మలన్ (బి) సామ్ కరన్ 57, కోహ్లీ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 1, పంత్ (బి) ఆర్చర్ 30, శ్రేయస్ (సి) మలన్ (బి) ఆర్చర్ 37, పాండ్యా (సి) స్టోక్స్ (బి) వుడ్ 11, శార్దూల్ (నాటౌట్) 10, సుందర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 4, భువనేశ్వర్ 0, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 185/8. వికెట్ల పతనం: 1-21, 2-63, 3-70, 4-110, 5-144, 6-170, 7-174, 8-179, బౌలింగ్: రషీద్ 4-1-39-1, ఆర్చర్ 4-0-33-4, వుడ్ 4-1-25-1, జోర్డాన్ 4-0-41-0, స్టోక్స్ 3-0-26-1, సామ్ కరన్ 1-0-16-1.
ఇంగ్లండ్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 40, బట్లర్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 9, మలన్ (బి) చాహర్ 14, బెయిర్స్టో (సి) సుందర్ (బి) చాహర్ 25, స్టోక్స్ (సి) సూర్యకుమార్ (బి) శార్దూల్ 46, మోర్గాన్ (సి) సుందర్ (బి) శార్దూల్ 4, సామ్ కరన్ (బి) పాండ్యా 3, జోర్డాన్ (బి) పాండ్యా (బి) శార్దూల్ 12, ఆర్చర్ (నాటౌట్) 18, రషీద్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 177/8. వికెట్ల పతనం: 1-15, 2-60, 3-66, 4-131, 5-140, 6-140, 7-153, 8-177, బౌలింగ్: భువనేశ్వర్ 4-1-30-1, పాండ్యా 4-0-16-2, శార్దూల్ 4-0-42-3, సుందర్ 4-0-52-0, చాహర్ 4-0-35-2.