కొత్తపల్లి, మార్చి 18: అంతర్జాతీయ పారాలింపిక్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు(68) గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా హైదరాబాద్లోని ఓ దవాఖానలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో బంధువులు, గ్రామస్తులు, క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలతో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి రాజవీరు ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవే క్షించారు. గర్రెపల్లి గ్రామం లో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు వృత్తిరీత్యా ఆర్టీసీలో మెకానిక్గా చేరా రు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994 లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. 1996లో లండన్లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో శ్రీనివాస్ స్వర్ణపతకాన్ని సాధించారు. 2002లో బెంగుళూరులో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్లో స్వర్ణం దక్కించుకున్నా రు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డును ప్రకటించింది.