మేడ్చల్, మార్చి 18: సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పి నగదును దోచుకెళ్లిన దొంగలను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీసీ పద్మజ వెల్లడించారు. కుత్బుల్లాపూర్కు చెందిన మణికంఠ, టి. శ్రీహరి, ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సాయ్సంగ్లు మేడ్చల్లో నివాసముంటున్న నిర్మల్కు చెందిన అఖిల్ అహ్మద్(32)తో పాటు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్(21), షేక్ అజీమ్ (25)లు పేకాట ఆడుతుండే వారు. ఆటలో ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకుంటున్న అఖిల్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్లు ఓ పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 14న సాయంత్రం మణికంఠ, శ్రీహరి, సాయ్సంగ్లను మేడ్చల్కు రప్పించి పట్టణంలోని ఆర్ఆర్ లాడ్జ్లో పేకాట ఆడుతున్నారు. అదే సమయంలో నిజామాబాద్కు చెందిన గణేశ్ (28), షేక్ కైసర్ (30) పోలీసుల వేషధారణలో లాడ్జ్లోకి రాగా బయట షేక్ అక్బర్ కాపలా ఉన్నాడు. లాడ్జ్లోపలికి వచ్చి వారు గది తలుపు తట్టి హడావిడి చేయగా పేకాట ఆడుతున్న అఖిల్ పోలీసులు వచ్చారని అరువడంతో, షేక్ అహ్మద్ వెళ్లి తలుపు తీశాడు. పోలీసుల వేషంలో వచ్చిన గణేశ్ డమ్మీ తుపాకితో బెదిరించగా కైసర్ లాఠీతో అందరిని కొట్టాడు.
దీంతో అఖిల్ ముందుగా కొంత నగదును తీసి అక్కడున్న మంచంపై వేయడంతో మిగిలిన వారు కూడా తమ డబ్బును తీసి ఇచ్చారు. మొత్తం రూ.2.22లక్షలను తీసుకుని పోలీసుల వేషధారణలో వచ్చిన గణేశ్, కైసర్లు బెడ్షీట్లో మూటకట్టుకున్నారు. అనంతరం అందరిని మోకాళ్ల పై నిలబెట్టి ఈ విషయం తమ ఉన్నతాధికారులతో చెప్పి తగిన చర్యలు తీసుకుంటామని డబ్బులు తీసుకుని వెళ్లారు. అనంతరం తాము మోసపోయామని తెలుసుకున్న మణికంఠ, శ్రీధర్, సాయ్సంగ్లు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారితో పాటు అప్పటి వరకు ఉన్న అఖిల్, అహ్మద్, అజీమ్లు భయమేస్తుందని చెప్పి మెల్లగా జారుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన మేడ్చల్ పోలీసులు గురువారం మెదక్ జిల్లా, కాల్లకల్లో ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. ఆరుమంది నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన మేడ్చల్ ఎస్ఐ ప్రవీణ్రెడ్డి, ఎస్ఐలను డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.