నాడు అధ్వానంగా గ్రామ పరిసరాలు
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి జాడలు
పాలకులు, అధికారుల కృషితో కొత్త వెలుగులు
చిన్నగూడూరు, మార్చి 13:ఒకప్పుడు అధ్వానంగా ఉన్న జయ్యారం.. ఇప్పుడు ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇరుకురోడ్లు, పిచ్చిమొక్కలు, బురదతో ఉండే వీధులు కనుమరుగై అద్దంలాంటి సీసీరోడ్లు, పరిశుభ్రత పరిసరాలతో పాటు ఊరంతా పచ్చని మొక్కలతో ఊరే మారిపోయింది. పాలకులు, అధికారులు, గ్రామ ప్రజల సమష్టి కృషితో ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డు, నర్సరీ, వైకుంఠధామం పూర్తికావడంతో పల్లెకు కొత్త వెలుగు వచ్చింది.
పల్లె ప్రగతితో జయ్యారానికి మోక్షం వచ్చింది. ఇదివరకు మరిపెడ మండలంలో పెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామం.. నేడు అందరి సమష్టి కృషితో ఆదర్శ గ్రామంగా రూ పుదిద్దుకుంది. ఇప్పటికే కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, నర్సరీ, సీసీ రోడ్లు, చివరి మజిలీ కోసం వైకుంఠధామం పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యాయి. ఏ వీధిలో చూసినా ఇటీవల నిర్మించిన సీసీరోడ్లతో సర్వాంగ సుందరంగా ప్రజలకు సౌకర్యవంతంగా మారాయి. గ్రామంలో 832 నివాస గృహాలు ఉండగా ఇంటింటా మరుగుదొడ్లతో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారు. గతంలో జయ్యారం, మన్నెగూడెం, మంగోరిగూడెం, మేఘ్యాతండా .. ఈ నాలుగు గ్రామాలు కలిసి ఒకే గ్రామ పంచాయతీగా ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదు. 500జనాభా ఉన్న ప్రతి ఆవాస ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేయడంతో నాలుగు గ్రామాలు జీపీలుగా ఏర్పడ్డాయి.
జీపీ సిబ్బంది సహకారం మరువలేం..
గ్రామాభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది అందిస్తున్న సహకారం మరువలేం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పారిశుధ్య పనులు చేస్తున్నారు. గ్రామంలో రోజూ తడిపొడి చెత్తను సేకరిస్తూ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుతున్నారు.
కరుణాకర్, కార్యదర్శి, జయ్యారం
సమష్టి కృషితోనే..
అధికారులు, పాలకవర్గం, స్థానికుల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. ఇప్పుడు వీధివీధిన సీసీరోడ్లు, పల్లెప్రగతిలో నిర్మించిన డంపింగ్యార్డు, ప్రకృతివనం, వైకుంఠధామం, కంప్టో షెడ్లను నిర్మించుకొని పంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్తో చెత్తను తరలించే పనులను చేపట్టి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాం.