వన్యప్రాణులతో పోచారం అభయారణ్యానికి కొత్త కళ
పర్యాటకుల కోసం ప్రత్యేకంగా బస్సు
పిల్లల కోసం పార్కు
ఆకర్షణగా నిలుస్తున్న వాచ్టవర్
పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
ఎల్లారెడ్డి, మార్చి 12: ప్రకృతి ప్రేమికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అడవిలోని అందాలను ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపుతున్నారు. అలాంటి వారిని ఆకర్షిస్తున్నది జిల్లాలోని పోచారం అభయారణ్యం. కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. అభయారణ్యంలో జింకలు, నెమళ్లు, సాంబార్లు, దుప్పులు, మనుబోతులు ఉన్నాయి. అభయారణ్యంలో తిరిగేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాహనాన్ని సైతం ఏర్పాటు చేసింది. పోచారం ప్రాజెక్టును, అటవీ అందాలను వీక్షించేందుకు 60 అడుగుల ఎత్తుతో వాచ్టవర్ ఉంది. పిల్లలతో సేదతీరేందుకు ఏర్పాటు చేసిన పార్కులో జారుడుబల్లలు, ఊయలలు, కుర్చీలు ఉన్నాయి. కరోనా కాలంలో ఇండ్లకే పరిమితమైన చాలామంది ప్రస్తుతం పోచారం అభయారణ్యం అందాలను వీక్షించేందుకు వస్తుండడంతో సందడిగా మారింది.
ప్రకృతిని ప్రేమించే వారు పెరగడంతో పోచారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. కరోనా నేపథ్యంలో పది నెలలుగా బయటికి వెళ్లకుండా ఉన్న ప్రజలు ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదించేందుకు వస్తుండడంతో పోచారం ప్రాజెక్టుతో పాటు అభయారణ్యం నిత్యం కళకళలాడుతున్నది. వందలాది జంతువులను నేరుగా వీక్షించే అవకాశం ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం అభయారణ్యం లో పర్యటించేందుకు అన్ని వసతులు కల్పించడంతో పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారు. అభయారణ్యంలో పర్యటించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనం ఉండడంతో పిల్లలు, పెద్దలు దానిలో ప్రయాణించి అటవీ అందాలతో పాటు పలు రకాల వన్యప్రాణులను వీక్షిస్తున్నారు.
మందలు మందలుగా వన్యప్రాణులు..
పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులు మందలు మందలుగా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా జింకలు, నెమళ్లు, దుప్పులు, మనుబోతులు ఉన్నాయి. అభయారణ్యంలోకి ప్రవేశించగానే కనిపించే జింకలు, కృష్ణ జింకలు పర్యావరణ ప్రేమికులను అకట్టుకుంటున్నాయి. వందల సంఖ్యలో ఉన్న జాతీయ పక్షి నెమళ్ల నాట్యాలకు పర్యాటకులు పులకరించిపోతున్నారు. సాంబార్ వంటి పెద్ద జంతువులు సైతం పెద్ద మొత్తంలో ఉండడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అభయారణ్యంలో చెట్లు ఎక్కువగా ఉండడంతో కొండ గొర్రెలు, అడవి పందులు, ఇతర రకాల జంతువులు కూడా కనిపిస్తున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా వాచ్ టవర్..
పోచారం ప్రాజెక్టు పక్కనే అభయారణ్యంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఇక్కడి ప్రత్యేకం. లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ సుమారుగా 60 అడుగుల ఎత్తు ఉండడంతో దాని పైకి ఎక్కి ప్రాజెక్టును, అభయారణ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టవర్ పైకి ఎక్కడానికి వీలుగా మెట్లు ఉండడంతో పిల్లలు, పెద్దలు టవర్ పైకి వెళ్లి జంతువులను చూస్తున్నారు. టవర్ నుంచి ఒక వైపు పోచారం ప్రాజెక్టు నీరు, మరో వైపు దట్టమైన అడవిని తలపించే చెట్లు, మరో వైపు అభయారణ్యంలోని మైదాన ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటున్నది.
పిల్లల ఆట విడుపు కోసం పార్కు..
అటవీ అందాలను వీక్షించిన పిల్లలు కాసేపు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రతి రోజూ సందడిగా ఉంటున్నది. పలు రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేయడం తో గంటల తరబడి పిల్లలు వాటితోనే ఆడుకుంటున్నారు. పచ్చ ని చెట్ల మధ్యన ఏర్పాటు చేసిన ఊయలలు, జారుడు బండలు, తాళ్లతో ఏర్పాటు చేసిన ఊయలలు పిల్లలకు, పెద్దలకు టైంపాస్ చేస్తున్నాయి. వివిధ రంగులతో వీటిని ఏర్పాటు చేయడంతో చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ వాటితో ఆడుకుంటున్నారు.
అభయారణ్యంలో రైడింగ్కు ప్రత్యేక బస్సు..
అభయారణ్యంలో ఐదు కిలోమీటర్ల రైడింగ్ కోసం అధికారులు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. పది మందికి పైగా ప్రయాణించేందుకు అవకాశం ఉన్న ఈ బస్సులోనే అభయారణ్యంలోకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. పెద్దలకు వంద రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు చార్జి చేస్తున్నారు. బస్సులో నుంచి చూడడానికి ప్రత్యేకంగా కిటికీలు ఉండడంతో జంతువులను వీక్షించే అవకాశం బాగుందని పర్యాటకులు పేర్కొంటున్నారు.