యంగాన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైన్యం అవినీతి ఆరోపణలు చేసింది. యాంగాన్ మాజీ సీఎం పయో మెన్ థేన్ నుంచి సూకీ భారీ ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మాజీ సీఎం నుంచి సుమారు ఆరు లక్షల డాలర్లతో పాటు బంగారం కూడా సూకీ తీసుకున్నట్లు సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్జా మిన్ తున్ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మయన్మార్లో ఉన్న ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి మయన్మార్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం కూడా మయన్మార్లో భారీ స్థాయిలో ర్యాలీలు జరిగాయి. సూకీపై వస్తున్న లంచం ఆరోపణలను ఆమె తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సూకీతో పాటు పలువురు నేతలు, అధికారులు ప్రస్తుం ఆర్మీ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల ఆధారంగా ప్రభుత్వాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూకీకి భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అక్రమరీతిలో ఆరు వాకీటాకీ రేడియోలను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కరోనా ఆంక్షలను కూడా ఆమె ఉల్లంఘించారు.