న్యూఢిల్లీ: ఓ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు నిందితుడిని నిలదీసింది. అత్యాచారానికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక జైలుకు వెళ్తావా అని ప్రశ్నించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మహారాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి మోహిత్ సుభాష్ చవాన్ తన మీద నమోదు అయిన రేప్ కేసులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఇవాళ సీజే ఎస్ఏ బోబ్డే ఆ కేసు విచారణ సందర్భంగా తీర్పునిస్తూ.. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం మీకు హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని, జైలు శిక్ష కూడా పడుతుందని అన్నారు. స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన మోహిత్పై పోక్సో చట్టం నమోదు చేశారు. అమ్మాయిని మోసం చేసి.. రేప్ చేసిన నీవు.. గవర్నమెంట్ ఉద్యోగి అన్న ఆలోచన లేదా అని సీజే ఆ నిందితుడిని ప్రశ్నించారు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మేం వత్తిడి చేయడంలేదు. కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. ఎందుకంటే మేం వత్తిడి చేస్తున్నామని నువ్వే ఆరోపిస్తావని సీజే అన్నారు. రేప్కు గురైన అమ్మాయిని తొలుత నిందితుడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ అప్పుడు ఆమె నిరాకరించింది. ప్రస్తుతం తనకు మరో పెళ్లి జరిగిందని, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనన్నాడు. అరెస్టుకు గురైతే, ఉద్యోగం పోతుందని ఆ నిందితుడు కోర్టు తెలిపారు. నాలుగు వారాల వరకు అరెస్టును నిలిపివేస్తున్నామని ఇవాళ సీజే తన ఆదేశాల్లో పేర్కొన్నారు.