హరితవేడుకగా నేడు మంత్రి జగదీశ్రెడ్డి పుట్టిన రోజు
నల్లగొండ ప్రతినిధి, జూలై 17(నమస్తే తెలంగాణ) : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 56వ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన స్ఫూర్తితో ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులతోపాటు అభిమానులు సిద్ధమయ్యారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో చేపడుతున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లా అంతటా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. సాధారణంగా పార్టీ శ్రేణులు, అభిమానుల నడుమ జన్మదినం జరుపుకొనే మంత్రి జగదీశ్రెడ్డి కిందటేడు మాదిరిగానే ఈ సారి కూడా కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వీలైతే సామాజిక బాధ్యతగా ఒక్క మొక్కను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే తనకు శుభాకాంక్షలు తెలిపినట్లుగా భావిస్తానన్నారు. అదే విధంగా ఈ నెల 24న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చనలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రిపై ప్రేమాభిమానాలతో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఓ వైపు పార్టీ శ్రేణులు, నేతలు మరో వైపు అభిమానులు ఎవరికి వారే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో ముమ్మరంగా మొక్కలు నాటడంతోపాటు ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీతో పాటు ఆశ్రమాల్లో అన్నదానం కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలకు సన్నద్ధం అవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలోనూ పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సైకత శిల్పంతో శుభాకాంక్షలు..
ఒడిషాలోని పూరీ పట్టణ సమీపంలో సముద్ర తీరాన మంత్రి జగదీశ్రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించి సూర్యాపేట వాసులు తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్కుమార్, యువనేతలు కీసర వేణుగోపాల్రెడ్డి, వేమారెడ్డి సూర్యాపేట వాసుల తరఫున ప్రత్యేకంగా దీనిని తయారు చేయించారు. సముద్ర తీరంలో భారీ ఎత్తున ఇసుకదిబ్బపై దీన్ని రూపొందించారు. 24గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను ప్రతిబింబించేలా బ్యాక్డ్రాప్తో ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ బొమ్మలతో మంత్రి జగదీశ్రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. దీనిపై ‘24X7 పవర్ ఇన్ తెలంగాణ, హ్యాపీ బర్త్డే జగదీశ్రెడ్డి సార్’ అని రాయించి ప్రత్యేక అభిమానాన్ని చాటుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.