కోదాడ, జూలై 27 : స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) కోర్సు వరంలా మారింది. ఉన్నత విద్య చదవలేని కొందరు, కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మరికొందరు, తొందరగా జీవితంలో స్థిరపడాలని ఇంకొందరూ పదో తరగతి తర్వాత ఐటీఐ కోర్సులను ఎంచుకుంటున్నారు. కోర్సు అభ్యాసంలో నైపుణ్యం కనబరిచి ఉపాధికి బాటలు పరుచుకుంటున్నారు. దీంతో కొన్నేళ్లుగా ఈ కోర్సులో ప్రవేశానికి బాగా డిమాండ్ పెరిగింది. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) కళాశాలలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
WWW.ITI.TELANGANA.GOV.IN వైబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28వరకు గడువు ఉంది. ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లోనే ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెల్ఫోన్ల ద్వారా సమాచారం చేరవేస్తారు. పదో తరగతి పాయింట్లు, రిజర్వేషన్లు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ర్టాన్ని యూనిట్గా తీసుకొని విద్యార్థులు ఆప్షన్ల ఎంపిక మేరకు ట్రేడ్లను కేటాయిస్తూ ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్ ఆప్షన్లే కీలకం
దరఖాస్తు చేసుకున్న వారు ట్రేడ్ ఐటీఐలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలకంగా మారింది. గతంలో ఐటీఐల వారీగా విద్యార్థులు తమకు కావాలసిన ట్రేడ్లలో దరఖాస్తు చేసుకుని ప్రవేశాలు పొందేవారు. అప్పుడు ఒక్కో ఐటీఐలో చేరేందుకు కనీసం 10 ట్రేడ్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ట్రేడ్ల ఎంపిక, సీట్ల కేటాయింపు కీలకంగా మారింది. ఎక్కువ మంది విద్యార్థులు జాతీయ వృత్తి విద్యా మండలి గుర్తింపు ఉన్న వాటిలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎంపికలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా కోరుకున్న ట్రేడ్ లభించే అవకాశం ఉండదు. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేయాలి.
ఉద్యోగావకాశాలు
పారిశ్రామిక ప్రాంతాలు, పరిశ్రమల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి లభిస్తుంది. రోజురోజుకు పారిశ్రామిక అవసరాలు పెరిగిపోతున్నాయి. శిక్షణ తర్వాత వెంటనే అప్రెంటిస్షిప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అప్రెంటిషిప్ యాక్ట్ 1961 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల సంస్థలు ఉపకార వేతనం అందిస్తారు. సింగరేణి, టీఎస్ ఎన్సీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఆర్టీసీ శాఖలాంటి ప్రభుత్వ రంగం, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ట్రేడ్లు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22 కళాశాలలు ఉండగా, అందులో 4 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. నల్లగొండలో 2, హాలియాలో1, భువనగిరిలో 1 ఉన్నాయి. మిగిలిన 18 కళాశాలలు ప్రైవేట్కు చెందినవి. సూర్యాపేట జిల్లాలో 5కళాశాలల్లో కలవు. కోదాడలో 1, సూర్యాపేటలో1, అర్వపల్లిలో 1, తిరుమలగిరిలో 1, నేరేడుచర్లలో 1 ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సివిల్, డ్రాఫ్ట్మన్, కటింగ్ మెకానిక్, మోటార్ మెకానిక్ అందుబాటులో ఉన్నాయి.
పోటీ పెరిగింది
ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే ఉపాధి లభిస్తుండడంతో పోటీ పెరిగింది. శిక్షణ పొందిన వారు మంచి వృత్తి నైపుణ్యం కలిగిన కార్మికులుగా తయారవుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే అప్రెంటిషిప్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అప్రెంటిషిప్ సమయంలో ఉపకార వేతనం ఇస్తారు. దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 28వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నాం.