ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు ఓటేయండి… అభివృద్ధిని నాకు వదిలేయండి అని సీఎం కేసీఆర్ పిలుపునకు స్పందించి సాగర్ ప్రజలు భారీ మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించారు. చెప్పిన విధంగానే ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ సోమవారం హాలియాకు వచ్చారు. సాగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన సాగర్ ప్రజలకు పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను ముందే చాలారోజుల క్రితమే రావాలే… సాగర్ ఎన్నికల సభలో పాల్గొని పోయిన తరువాత నన్ను కూడా కరోనా విడిచిపెట్టలేదు… నేను ఇక్కడకు రాలేకపోయానంటూ తన పెద్దరికాన్ని ప్రదర్శించారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ఆలోచించి మంత్రి జగదీశ్రెడ్డి చెబితే ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మీ అందర్ని కలుసుకునే అవకాశం కలిగింది… అంటూ వివరించారు. ఇక్కడి రాగానే మీ నవయువ ఎమ్మెల్యే నోముల భగత్ చాంతాడంత లిస్టు నాకు ఇచ్చాడని చెబుతూనే…. ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగాల్సి ఉందన్నారు. కనీసం పొలాలకు వెళ్లే డొంకదారుల్లో చిన్నిచిన్న కల్వర్టులు లేవు… కాజ్వేలు కూడా లేవు… అట్లాగే ఆస్పత్రుల పరిస్థితి కూడా అంత బాగాలేదన్నారు. హాలియా పట్టణాన్ని చూడాలని కూడా మంత్రి, ఎమ్మెల్యేలు కలిసి హెలీప్యాడ్ను ఇంకో దిక్కు మార్చారని చెప్పారు. హాలియా ఊరు చూస్తే ఏం బాగా లేదు. అసలే బాగా లేదు. బాగు చేసి మనం చూపెట్టాలే.. అద్భుతంగా తయారు చేయాలి అని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే భగత్కు స్పష్టం చేశారు.
అవసరమైతే ఈసారి నందిగొండకు..
నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రూ.150 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో హాలియాకు 15కోట్లు, నందికొండకు 15కోట్లు చేస్తున్నానని చెప్పారు. ఇక నియోజకవర్గంలోని రోడ్లు, బ్రిడ్జీలు, ఇతర వసతులను మెరుగపర్చడానికి 120కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి సాధించాలని సూచించారు. ఎమ్మెల్యే కొత్త కావడంతో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సమగ్రంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టుకుని చర్చించాలని సూచించారు. మున్సిపాలిటీల విషయంలో మంత్రి కేటీఆర్తోపాటు నిపుణులను రప్పించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. అవసరమైతే ఈ సారి తానే స్వయంగా నందికొండకు వస్తానని కూడా సాగర్ అభివృద్ధి పట్ల తన తపనను స్పష్టం చేశారు. ఇక నందికొండ మున్సిపాలిటీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రభుత్వ జాగాలో, ప్రభుత్వ క్వార్టర్స్ల్లో నివసించే వారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందని ఎన్నికల సందర్భంలో నాకు చెప్పినారు. నేను హామీ కూడా ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రెగ్యులరైజ్ చేసేలా కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నెలరోజుల్లో ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్.రవీంద్రకుమార్, ఎన్.భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి, మండలి మాజీ వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రైతుబంధు సమితి కన్వీనర్ రాంచంద్రనాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర నేతలు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సోమ భరత్కుమార్, ఎంసీ కోటిరెడ్డి, నంద్యాల దయాకర్రెడ్డి, కడారి అంజయ్యయాదవ్, ఇరిగి పెద్దులు, అధికారులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, అడిషన్ కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్శర్మ, ఎస్పీ రంగనాథ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు
నల్లగొండ జిల్లాను ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతూ సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా ప్రజల తరఫున సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దానికి కేసీఆర్ ప్రత్యేక ప్రేమనే నిదర్శనమన్నారు. రాష్ట్రం వచ్చినరోజు నల్లగొండ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడుతున్నదని, పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఆ నీళ్లను వాడుకోలేక భూములన్నీ బీడులుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఫ్లోరోసిస్తోనూ జిల్లా నాశమై ఉందని, ఉద్యమ సమయంలో కేసీఆర్ జిల్లాను సందర్శించి, ఆనాడే ఫ్లోరైడ్ బాధితులకు భరోసా ఇచ్చారన్నారు. రాష్ట్రం వచ్చినరోజు నుంచే జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. దాదాపు 27సార్లు కేసీఆర్ జిల్లాలో పర్యటించి, 60వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించారన్నారు. ఫ్లోరైడ్ను తరిమికొట్టి, కరువు కాటకాలను పారదోలారని చెప్పారు. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నా… అభివృద్ధి జరగలేదని, కేవలం ఏడేండ్లలోనే జిల్లాను అభివృద్ధి పథంలో పెట్టారని వివరించారు. ఇక దళితబంధు పథకంతో వారి జీవితాల్లోనూ వెలుగు రావాలని, అన్నివర్గాల సంక్షేమంతోనే రాష్ట్రం బాగుంటుందన్న కేసీఆర్ సంకల్పానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గుర్రంపోడుకు లిఫ్ట్
సభా వేదిక మీదకు వస్తుంటే…. గుర్రంపోడ్ ప్రాంతంలో ఒక లిప్టు పెట్టినట్లయితే మాకు ఐదారు గ్రామాలకు కలిపి ఒక పదివేల ఎకరాలకు సాగునీరు వస్తుందని మీ ఎమ్మెల్యే భగత్ అడిగాడు. వీటితోపాటు ఇంకా సమస్యలు చర్చించేందుకే వేదిక మీదకు రావడానికి కొంత ఆలస్యమైంది. సీఈ గారిని పిలిచి మాట్లాడినం.. నా సెక్రటరీ స్మితా సబర్వాల్కు కూడా చెప్పాం. గుర్రంపోడు లిఫ్టుకు వెంటనే సర్వే చేపట్టావల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. సర్వే రిపోర్టు రాగానే దాన్ని కూడా నెల్లికల్ లిప్టుతోపాటు పూర్తికి ఆదేశాలు ఇస్తామన్నారు. దేవరకొండ, సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల కోసం మంజూరు చేసిన మొత్తం 15 లిఫ్టుల పనులను కూడా ప్రారంభించి వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా పాలేరు నుంచి గోదావరి జలాలను పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. వీటి అనుసంధానంతో శాశ్వతంగా సాగర్ ఆయకట్టులో సాగునీటికి పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఇక పోడుభూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర చట్ట ప్రకారం 2005 నాటి వాటికి త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలో అడవులు తక్కువ కాబట్టి ఇక్కడి ప్రజాప్రతినిధులు సామాజిక అడవులను పెంచాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, రహదార్ల వెంబడి చెట్లు పెంచి జిల్లాలో హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
డిగ్రీ కళాశాల భవనానికి నిధులు
హాలియాలో డిగ్రీ కాలేజీకి కొత్త భవనం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు సిబ్బంది ఏర్పాటుకు నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక సాగర్లో రెడ్డి కళ్యాణ మండపానికి గతంలో ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డితో కొంతమేరకు కృషి జరిగిందని, ఇప్పుడు దానికి రెండున్నర ఎకరాల స్థలానికి ఆమోదం తెలిపారు. దీంతోపాటు మినీ స్టేడియానికి స్థలం అందుబాటులో ఉందంటూ ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు దాని నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇక షాదీఖానాలకు నిర్మాణానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హెల్త్ సెంటర్లను కూడా అప్గ్రేడ్ చేస్తామని వివరించారు.
మార్మోగిన చప్పట్లు
సాగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో ప్రజా ప్రతినిధులు పలుమార్లు చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నసేపూ ఆసక్తికరంగా వింటూ కనిపించారు. అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించిన ప్రతిసారీ ఈలలు, చప్పట్లతో తమ అభిలాషను వ్యక్తం చేశారు. ముఖ్యంగా 150కోట్ల నిధుల ప్రకటన సమయంలో, ఎన్ఎస్పీ క్వార్టర్ల అంశంలో, గుర్రంపోడు లిఫ్టు విషయంలో, మున్సిపాలిటీల వారీగా ప్రస్తావన సమయంలో కేసీఆర్ స్పీచ్కు మంచి స్పందన లభించింది. సాగర్ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని, గతంలో ఉన్నవారు ఇక్కడా అనుకున్నంతగా చేయలేదని విమర్శలు చేసిన సమయంలోనూ హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.