దేవరకొండ. జూలై 14 :పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సమలన్నీ పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపడడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలను అధికారులు పరిష్కరించడంతో ప్రజల ఇబ్బందులు తప్పాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొత్తం 20 వార్డులకు 10 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. అనంతరం వాటిని కంప్యూటరీకరించి దశల వారీగా పరిష్కరిస్తున్నారు. మున్సిపాల్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.28 లక్షల చొప్పున మంజూరు చేస్తున్న నిధులతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించనున్నారు.
పరిశుభ్రంగా మారిన పట్టణం
10 రోజుల పాటు అధికారులు, మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో పర్యటించి చాలా వరకు సమస్యలను పరిష్కరించారు. కంపచెట్లు, డ్రైనేజీల్లో చెత్త తొలగించడం, ప్రధాన రహదారులను శుభ్రపర్చడం, రోడ్ల వెంట మొక్కలు నాటడం, వీధి దీపాలను సరిచేయడం, లేని చోట కొత్తవి ఏర్పాటు చేయడం, కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయడం, శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగించడం వంటి సమస్యలను పరిష్కరించారు. 20 వార్డులకు గాను 400 సమస్యలను గుర్తించగా అందులో 280 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. తాము నిత్యం ఎదుర్కంటున్న సమస్యలు పరిష్కారమవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షాబూనగర్లో పూడిన గుంతలు
మిర్యాలగూడ టౌన్: పట్టణ ప్రగతితో మిర్యాలగూడ మున్సిపాల్టీ పరిధిలోని షాబూనగర్లో మురుగు సమస్య పరిష్కారమైంది. అంతకు ముందు కాలనీలో రోడ్డు వెంటే మట్టి, చెత్త కుప్పలు ఉండడం, రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కునే వారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి నడిచేందుకు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పట్టణ ప్రగతిలో భాగంగా అధికారులు రోడ్డు వెంట ఉన్న మట్టి, చెత్తను తొలగించారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.