రామగిరి/ బొడ్రాయిబజార్, జూలై 19 : తెలుగు సంవత్సరాల్లో 12మాసాలు ఉంటాయి. వీటిలో 24 పర్యాయాలు ఏకాదశి వస్తుంది. ఆషాడ బహుళ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి మంగళవారం వస్తుండడంతో వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఏకాదశి శివుడికి ప్రీతికరమైంది కావడంతో కొంత మంది భక్తులు శివనామస్మరణ చేస్తూ ముక్కంటికి పూజలు చేస్తారు. ఉపవాస దీక్షలు, జాగరణ, ప్రత్యేక పంచామృత అభిషేకాలు, సామూహిక లలిత సహస్రనామ, గీతా పారాయణం చేస్తారు.
ప్రసిద్ధిగాంచిన వాడపల్లి ఆలయాలు
దామరచర్ల : మండలంలోని వాడపల్లిలో కృష్ణా, మూసీ నదుల సంగమం తీరంలో వెలిసిన మీనాక్షీ అగస్తేశ్వరస్వామి, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచినవి. తొలి ఏకాదశికి ఈ ఆలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు. పర్వదినానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మృత్యుంజయశాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్ కె.సిద్ధయ్య తెలిపారు.
తొలి ఏకాదశికి ముస్తాబైన ఆలయాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన హరిహరాధుల ఆలయాలు శివ, విష్ణునామ స్మరణతో మార్మోగనున్నాయి. యాదగిరిగుట్టలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంతోపాటు మట్టపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వాడపల్లిలోని అగస్తేశ్వరస్వామి ఆలయం, నాగార్జునసాగర్లోని శివాలయాలతోపాటు కృష్ణానది తీరాన ఉన్న శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకనుగుణంగా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. నల్లగొండ పట్టణంలోని పానగల్లో గల పచ్చల, ఛాయా సోమేశ్వర ఆలయాలతోపాటు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఛాయా సోమేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో కొవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణం రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయం, తులసీనగర్లోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, పాతబస్తీలోని శివాలయం, బ్రహ్మగుట్టపై గల శివాలయం, కలెక్టరేట్ సమీపంలోని అయ్యప్ప దేవాలయంలోని శివాలయం, రామగిరిలోని కనకదుర్గ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయం, వివిధ ప్రాంతాల్లోని శివాలయాల్లో ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర, వేణుగోపాల, అన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి.
అపురూపం తుమ్మలపల్లిలోని ద్వంద శివాలయం
చండూరు : మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో రాతిగుట్టపై వెలిసిన పురాతన పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయంలో రెండు శివలింగాలు, రెండు నందీశ్వరులు, రెండు గోపురాలు, రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఈ ద్వందాలయం ప్రత్యేకత. ఏకాదశి ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేయనున్నారు.