నేరేడుచర్ల, జూలై 18 : ఇంటి నిర్మాణంలో వంట గది, దేవుడి గుడి, పడక గది అని ఎలా స్థలం కేటాయిస్తామో మొక్కలకు కూడా స్థలం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు అవసరమైన స్థలాన్ని విడిచిపెట్టిన తర్వాతే ఇల్లు కట్టుకోవాలి. ఇంటి చుట్టూ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాణవాయువు వెదజల్లే పచ్చదనం అవసరమని వైద్యులు కూడా చెబుతున్నారు. మార్కెట్లో రసాయనాలు వాడని పండ్లు, కూరగాయలు దొరకడం గగనమైపోయింది. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రాణాంతకమైన క్రిమిసంహారకాలు, రసాయనాలు పండ్లపై నేరు గా వాడుతున్నారని అనేక పరిశీలనలు తేటతెల్లం చేస్తున్నాయి. రోజూ ఓ పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే నానుడి నుంచి పండ్లు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందేనన్న దుస్థితి ప్రస్తుతం దాపురించింది. ఈ నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో, అందుబాటులో ఉన్న స్థలాల్లో పండ్ల మొక్కలను నాటుకోవడం ద్వారా నాణ్యమైన పండ్లను తినవచ్చు. మరోవైపు పండ్లు, కూరగాయల ధరలు సైతం మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలు పండించడం ద్వారా ఆరోగ్యంతోపాటు డబ్బు ఆదా చేయవచ్చు. పచ్చదనం పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి ఇంటికీ ఈసారి 6 మొక్కలు ఇస్తున్నారు. వాటిని సక్రమంగా పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యులపైనే ఉంది.
ఇదే సరైన సమయం
వానకాలం కావడంతో భూమి పదునుగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు అనుకుల వాతావరణం నెలకొంటున్నది. ఈ సమయంలో మొక్క నాటితే కొంత వరకు ఎదిగి వాతావరణ పరిస్థితులను తట్టకునే సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుంది. దానికి తోడు నవంబరు నెల వరకు వీటికి నీటిని ప్రత్యేకంగా పోయాల్సిన అవసరం ఉండదు.
ఒక్క సారి నాటితే..
మొక్కను పెంచడం అనేది మనసుకు తృప్తినిస్తుంది. నాటిన రోజు మొదలుకొని ప్రతి రోజూ ఉదయాన్నే పెరుగుతున్న దాన్ని చూస్తే ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతి రోజూ మొక్కలు పెంచడంలో కలిగే శారీరక శ్రమ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నది. పెరిగే మొక్కలను చూస్తే ఎంతో ఆనందం కలుగుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తన రకాలతో మామిడి, సీతాఫలం, నిమ్మ నాలుగేండ్లకు, జామ, సపోటా, కొబ్బరి, ఉసిరి, దానిమ్మ మూడేండ్లకు, అరటి, బొప్పాయి ఏడాదికే కాతకు వస్తాయి. మనం నాటిన మొక్క ఫలాలను కోసే సమయంలో వాటిని తింటున్నప్పుడు మనుసుకు కలిగే తృప్తిని వెలకట్టలేం.
ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలి
ప్రతి ఇంటా మొక్కలు పెంపకం అవసరం. మొక్కల పెంపకంతో పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. నాణ్యమైన పండ్లను ఇష్టంగా తినవచ్చు. వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయం. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలి.