సూర్యాపేట రూరల్, జూలై 13 : మూసీ ప్రాజెక్టును ఆధునీకరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. పట్టణంలోని అంజనాపురి కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి జగదీశ్రెడ్డి మూసీ ప్రాజెక్టును ఆధునీకరించడంతోపాటు రూ.74 కోట్లతో కాల్వలకు మరమ్మతులు చేపట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.120 కోట్లతో చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్రెడ్డి తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిపై అర్థం లేని ఆరోపణలు చేస్తే మూసీ ఆయకట్టు రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, టీఆర్ఎస్ నాయకులు సంకరమద్ది రమణారెడ్డి, మాలి అనంతరెడ్డి, ఈదుల యాదగిరి, చింతలపాటి మధు, ఉపేందర్, రాఘవరెడ్డి, గోగిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
రోడ్ల వెంట మొక్కలు నాటాలి..
రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. మండలంలోని బాలెంల, ఎర్కారం, రాజానాయక్తండా స్టేజీల వద్ద సూర్యాపేట – జనగాం రహదారి వెంట మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను మంగళవారం వారు పరిశీలించి మాట్లాడారు. ఎంపీడీఓ శ్రీనివాస్రావు, ఏపీఓ వెంకన్న, వైస్ ఎంపీపీ శ్రీనివాస్నాయుడు, సర్పంచులు మౌనిక, రమేశ్, అశోక్, ఉప సర్పంచ్ నర్సింగ్నాయక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.