మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ. నియోజకవర్గ కేంద్రమైనఈ గ్రామం గతంలో సమస్యల నిలయంలా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతితో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో పలు సమస్యలకు పరిష్కారం లభించింది.
జనాభా 7,647..
మునుగోడు గ్రామ జనాభా 7,647. సుమారు 2,500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పంచాయతీ పరిధిలో లక్ష్మీదేవిగూడెం, తుర్కగూడెం, సానబండ, కమ్మగూడెం, మంగదొడ్లగూడెం, బట్లకాల్వ ఆవాస గ్రామాలున్నాయి.
ప్రకృతి వనాలతో ఆహ్లాదకరంగా..
పంచాయతీ పరిధిలో మొత్తం ఐదు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 3వేల మొక్కలు నాటడంతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. చండూరు రోడ్డులోని సర్వే నంబర్ 78లో అర ఎకరంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి 1,200 మొక్కలు నాటారు. జడ్పీహెచ్ఎస్ ఎదురుగా వెంచర్లో నిబంధనల ప్రకారం పంచాయతీకి పదిశాతం భూమి కింద 10 గుంటల స్థలం లభించింది. దాని చుట్టూ కంచెను ఏర్పాటు చేసి 400 మొక్కలు నాటారు. చౌటుప్పల్ రోడ్డులోని మరో వెంచర్లో పంచాయతీకి దక్కిన 10 గుంటల భూమిలో 800 మొక్కలు నాటారు. దీంతో పాటు స్థానిక నల్లాల బావి వద్ద అర ఎకరంలో మరో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి 600 మొక్కలు నాటారు. పంచాయతీ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరందిస్తూ సంరక్షిస్తున్నారు.
రూ.10లక్షలతో వైకుంఠధామం..
మునుగోడులోని సర్వే నంబర్ 359లో ఎకరం విస్తీర్ణంలో రూ.10లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. ఇందులో బర్నింగ్ పాయింట్, స్నానాల గదులు, దింపుడు కళ్లం, తదితర సౌకర్యాలను కల్పించారు. వైకుంఠధామం త్వరలో వినియోగంలోకి రానుంది.
రోజూ చెత్త సేకరణ..
పల్లె ప్రగతి నిధులు రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. దీని ద్వారా ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లోని చెత్తను రోజూ సేకరిస్తున్నారు. ఇండ్ల నుంచి చెత్త సేకరణ కోసం అదనంగా మరో ట్రాక్టర్ను కిరాయికి తీసుకున్నారు. రోజూ 250 ఇండ్ల నుంచి చెత్తను.. పల్లె ప్రగతిలో భాగంగా రూ.2.5లక్షలతో నిర్మించిన కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. ఇక్కడ చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 కిలోల ఎరువు తయారు కాగా హరితహారం మొక్కలకు వేశారు.
పచ్చని స్వాగతం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ కింద గ్రామానికి నలువైపులా ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ల వెంట 4,273 మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరో 1,500 మొక్కలను రోడ్ల వెంట నాటించారు. దీంతోపాటు మార్కెట్ యార్డులో 800, ముస్లిం శ్మశాన వాటికలో 3,000, మండల పరిషత్లో 500, పీహెచ్సీలో 280, పద్మశాలీ శ్మశాన వాటికలో 300, పోలీస్స్టేషన్లో 100, పంచాయతీరాజ్ కార్యాలయంలో 150 చొప్పున నాటారు. మొక్కల సంరక్షణకు రూ.6.36లక్షలతో ట్రీగార్డులను సైతం ఏర్పాటు చేశారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇంటికి ఆరు మొక్కల చొప్పున ఇప్పటి వరకు 30వేల మొక్కలను పంపిణీ చేశారు.
పరిశుభ్రతకు పెద్దపీట..
వరద నీరు నిలిచి చిత్తడిగా మారుతున్న వార్డులను తొలుత గుర్తించారు. ఆయా కాలనీల్లో 2.5 కిలోమీటర్ల పొడవున రూ.65.38లక్షలతో సీసీ రోడ్లు వేశారు. మురుగునీరు పారేందుకు రూ.7.99లక్షలతో కాల్వలను ఏర్పాటు చేశారు. ఇండ్ల మధ్య, రోడ్ల వెంట ఉన్న కంపచెట్ల తొలగింపునకు రూ.1.23లక్షలు ఖర్చుచేశారు. రూ.9.10లక్షలతో వీధి దీపాలు అమర్చారు. రూ.11.24లక్షలతో మంచినీటి పైపులైన్, మోటర్లకు మరమ్మతులు చేయించారు. సానబండలో పడావుపడ్డ బావిని పూడ్చివేశారు.
మౌలిక వసతులు మెరుగుపర్చాం
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు మెరుగుపర్చాం. పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానం ద్వారా గ్రామంలోని సమస్యలను తొలుత గుర్తించాం. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాం.
పల్లె ప్రగతితో సమస్యలు తీరాయి
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో మా గ్రామంలో చాలా సమస్యలు తీరాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పల్లె ప్రగతిని అమలు చేశాం. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించుకున్నాం.