చందంపేట, జూలై 25: అందుబాటులో నీళ్లు.. నిరంతర విద్యుత్.. పొగిళ్ల గిరిజనుల జీవితాలను మార్చేశాయి. ఉపాధి కోసం ఏటా ఆంధ్రాకు వలస వెళ్లే ఈ గ్రామస్తులు నేడు అదే ప్రాంతానికి మిర్చి నారును ఎగుమతి చేస్తున్నారు. పొగిళ్ల ప్రాంతం ఆంధ్రాకు సమీపంలో ఉంటుంది. కృష్ణానది అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో మాచర్ల, కారంపూడి ప్రాంతాల రైతులు ఇక్కడి గిరిజనులతో సన్నిహితంగా ఉంటారు. గతంలో ఆయా ప్రాంతాలకు మిర్చి కూలి పనులకు వెళ్లే ఇక్కడి రైతులు నేడు స్థానికంగానే నారు పెంచుతూ ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో సుమారు 150మంది రైతులు పక్కనే ఉన్న సాగర్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు సుమారు రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగర్ బ్యాక్ వాటర్ నుంచి పైపులను ఏర్పాటు చేశారు. సాగర్ వెనుక జలాలతోనే పత్తి, కంది, మిర్చి, జొన్న, పెసర్లు, వేరుశనగ సాగు చేస్తున్నారు.
పైపులైన్ ద్వారా..
పొగిళ్ల ప్రాంతం నేడు మిర్చి నారుకు కేరాఫ్ అడ్రస్గా మారింది. మిర్చి విత్తనాలను చల్లి దానిపై చీరెలు కప్పి నారు పెంచుతున్నారు. వర్షాలపై ఆధారపడకుండానే సాగర్ బ్యాక్ వాటర్తో ఏర్పాటు చేసిన పైప్లైన్ ద్వారా తడులు అందిస్తున్నారు. ఒక్కో చీర విస్తీర్ణంలో అర ఎకరానికి సరిపడా సుమారు వెయ్యి మొక్కలు పెరుగుతాయి. సుమారు 800ఎకరాలకు సరిపడా నారు పొగిళ్లలోనే ఉత్పత్తి చేయడం విశేషం. ఒక్కొక్క మొక్కను ఒక్క రూపాయి చొప్పున విక్రయిస్తామని, ఆంధ్రా ప్రాంతానికి ఎగుమతి చేయడంతో పాటు కంబాలపల్లి, పాత కంబాలపల్లి, ఉస్మాన్ కుంట, ఎల్మలమంద, దేవరచర్ల, రేకులగడ్డ, యాపలపాయ తండా, చెవుట్ల, నేరెట్ల తండా, చిత్రియాల, పెద్దమూల, బుడ్డోని తండా గ్రామాలకు సరఫరా చేస్తామని రైతులు తెలిపారు.
24గంటల ఫ్రీ కరెంట్తోనే నారు పోస్తున్నం..
మేం ఎప్పటి నుంచో వేరే ఊర్లకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పని తప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుండడంతోని మా ఊరు దగ్గర్లో ఉన్న రేవు నుంచి పైపులు వేసుకున్నం. ఎప్పుడంటే అప్పుడు నీళ్లొస్తున్నయి. ఆ నీళ్లతోని పంటలు పండిస్తున్నం. ఒకప్పుడు మిర్చి నారు కావాలంటే ఆంధ్రాకు పోయి తెచ్చుకునేది. ఇప్పుడు మేమే పెంచి మాకు సరిపోయినంత వాడుకుని మిగతా ఆంధ్రా రైతులకు అమ్ముతున్నం. అప్పుడు మేము వాళ్ల కాడ పని చేసినం. ఇప్పుడు వాళ్లే మా కాడికి వచ్చి నారును కొంటున్నరు.
వలస పోయే బాధ తప్పింది..
నాకు పెళ్లయినకాన్నుంచి ఏటా కూలి పని కోసం ఆంధ్రాకు పోయేది. కానీ, ఇప్పుడు మా ఊర్లోనే, మా పొలంలోనే మిర్చి నారు పోస్తున్నం. అప్పట్లో మిర్చి నారుకు రేవు దాటి మాచర్లకు పోయి తీసుకొచ్చేటోళ్లం. ఇప్పుడు మాచర్ల వాళ్లే మా దగ్గరకు వచ్చి నారు కొనుక్కుంటున్నరు. పైపులైన్లు వేసి పత్తి, వేరుశనగ, జొన్న పండిస్తున్నం. సంతోషంగా ఉన్నది