మర్రిగూడ, జూలై 27 : మండలంలోని సరంపేటలో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలని జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. గ్రామంలోని సర్వే నంబర్ 280, 281లో 10ఎకరాల్లో చేపడుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కూలీల సంఖ్యను పెంచి మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ అధికారులను ఆదేశించారు. మొక్కలను వరుస పద్ధతిలో నాటేలా మార్కింగ్ చేసి కూలీలకు దిశానిర్దేశం చేయాలన్నారు. రెండ్రోజుల్లో మళ్లీ వస్తానని పనుల్లో పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, సర్పంచ్ వెనమల్ల వెంకటమ్మ, ఏపీఓ వివేక్, వెనమల్ల నర్సింహ, సర్వేయర్ జైహింద్, పంచాయతీ కార్యదర్శులు రాకేశ్, కృష్ణయ్య, షాకీర్అలీ, టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్ పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి : ఎంపీడీఓ
నల్లగొండ రూరల్ : పల్లె ప్రగతి అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి కోరారు. మంగళవారం జి.చెన్నారంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, సర్పంచ్ ఉప్పునూతల వెంకన్న, కార్యదర్శి సరిత, సిబ్బంది ఉన్నారు.
అయిటిపాములలో మొక్కల పంపిణీ
కట్టంగూర్ : హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ మొక్కలను ముమ్మరంగా పంపిణీ చేస్తున్నారు. మంగళవారం అయిటిపాములలో పంచాయతీ సిబ్బంది జామ, మామిడి, సపోట, మునగ మొక్కలను అందించారు. సర్పంచ్ బెజవాడ సరోజన మాట్లాడుతూ మొక్కలను వృథా చేయకుండా ఇంటి ఆవరణలో నాటుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.