నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు గ్రామం ప్రగతి బాటన పయనిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల కారణంగా పంచాయతీ పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. గతంలో ఎన్నో సమస్యలతో పాటు శ్మశాన వాటిక కూడా లేకపోవడంతో గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి నిధులతో సద్వినియోగం చేసుకొని మౌలిక వసతులు కల్పించారు. వైకుంఠధామం, ప్రకృతివనం, కంపోస్ట్ షెడ్డు నిర్మించారు.
నిడమనూరు, జూలై 16 : సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొనే హరితహారం కార్యక్రమం అమలుకు సర్పంచ్ అర్వ స్వాతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ను నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కేటీఆర్ సామాజిక ఉద్యాన వనం, కోతుల ఆహార శాల, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వెంట 18ఎకరాల్లో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. దారి గుండా వెళ్లే వారికి పచ్చదనం కనువిందు చేస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో ప్రలు సేదదీరుతున్నారు.
ఎటు చూసినా పరిశుభ్రతే..
గ్రామంలో ఎటు చూసినా పరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది. పల్లె ప్రగతి అమలులో భాగంగా చేపట్టిన పారిశుధ్య చర్యలతో గ్రామం ఆసాంతం అద్దంలా మెరిసిపోతున్నది. అదే విధంగా కోతుల ఆహారశాలలో బొప్పాయి, జామ చెట్లు కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. దీంతో గ్రామంలో కోతుల బాధ తప్పిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సార్ స్ఫూర్తితోనే…
సీఎం కేసీఆర్ సార్ స్ఫూర్తితో పల్లె ప్రగతి, హరిత హారం విజయవంతానికి ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మొక్కల సంరక్షణతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కారణంగా సత్ఫలితాలు వస్తున్నాయి. కోతుల ఆహార శాల, పల్లె ప్రకృతి వనంలో బొప్పాయి, ఇతరత్రా పండ్లు కోతుల ఆకలిని తీరుస్తున్నాయి. ప్రకృతివనంలో పచ్చదనం నీడన సేదతీరేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నేపథ్యంలో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది.