నల్లగొండ, జూలై 25 : ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి కొత్త కార్డులు అందనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు వాటిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 26,702 కుటుంబాలకు రేషన్ కార్డులు అందనుండగా, ఇందులో నల్లగొండ జిల్లాలో 11,395, సూర్యాపేట జిల్లాలో 9,373, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,934 కుటుంబాలు ఉన్నాయి. కొత్త కార్డుల జారీతో మరో 83,316 మందికి రూపాయికి కిలో చొప్పున నెలకు ఆరు కిలోల బియ్యం అందనున్నాయి.
పెరుగనున్న 498 టన్నుల కోటా
పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కుటుంబాల్లో ప్రతిఒక్కరికీ రూపాయికే కిలో చొప్పున నెలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 9,95,178 కార్డులు ఉండగా ఆయా కుటుంబాల్లోని 29,04,961 మందికి నెలకు ఆరు కిలోల చొప్పున ప్రతినెలా 17,428 టన్నుల బియ్యం అందిస్తున్నారు. 2,082 రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్డీలర్లు బియ్యం సరఫరా చేస్తున్నారు. కొత్త కార్డుల మంజూరుతో మరో 83,316 మంది లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ప్రతి నెలా 498 టన్నుల బియ్యం అదనంగా సరఫరా చేయనుంది. కొత్త కార్డులు వచ్చి న వారికి ఆగస్టు నుంచే బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ కార్డులేదనే బాధ పోయింది
2018లో కొత్త రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న. ఇప్పుడు ప్రభుత్వం మాకు కార్డు మంజూరు చేసిందని మా ఊరు వీఆర్వో చెప్పాడు. అప్పుడు మా అమ్మవాళ్ల కార్డులో నా పేరుండేది. ఇక నుంచి మా కుటుంబానికే కార్డు వస్తుందంటే సంతోషంగా ఉంది. కార్డు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాను. -మామిడి మమత,
-గంగన్న పాలెం, తిప్పర్తి మండలం
షుక్రియా కేసీఆర్ సాబ్
ఇంతకాలం రేషన్ కార్డులేక ఇబ్బందులు పడ్డాం. మాలాంటి పేద వారికి ఆహారభద్రత కార్డు చాలా అవసరం. సీఎం కేసీఆర్సార్ దయతో మాకు కొత్త కార్డు రావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి మా ఇబ్బందులు తీరినట్లే. ప్రతినెలా వచ్చే బియ్యంతో నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ సాబ్కు బహుత్, బహుత్ షుక్రియా. – షేక్ సుభానీబేగం, నిడమనూరు
సంతోషంగా ఉంది
ప్రభుత్వం మా కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కార్డు వస్తే మాకు ప్రతినెలా వచ్చే బియ్యం తో కుటుంబానికి ఎంతో ఆసరా దొరుకుతది. ఇప్పటి వరకు బయట బియ్యం కొనలేక ఇబ్బంది పడుతున్నం. మాలాంటి వారికి కార్డు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
-జూలూరు మౌనిక,బీఎన్ఆర్ కాలనీ, దేవరకొండ
నాలుగేండ్లుగా ఎదురు చూస్తున్న
నా పెండ్లి కాగానే మా అమ్మవాళ్ల కార్డు నుంచి నా పేరు తీసేశారు. అందుకే 2018లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాము. నాలుగేండ్లుగా కార్డు కోసం ఎదురు చూస్తున్నాను. రేషన్కార్డు లేక పోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ సార్ కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించడంతో మాలాంటి వారి ఇబ్బందులు తొలగిపోయాయి.
-పల్లేటి మనీషా, ఉండ్రుగొండ, చివ్వెంల మండలం
నేటి నుంచి కార్డుల పంపిణీ
ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి ఈ నెల 30 వరకు కార్డులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తాసీల్దార్ తమ మండలాల్లో కార్డులు ప్రింట్ తీసుకొని పంపిణీ చేస్తారు. నల్లగొండ జిల్లాలో 11,395 మందికి కొత్తగా కార్డులు మంజూరయ్యాయి. వీరికి కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ