నార్కట్పల్లి, జూలై 18 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. చెత్త సేకరణ, డంప్ యార్డులకు తరలింపు, నిరంతర పర్యవేక్షణ వంటి పనులతో పల్లెలు, పట్టణాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. మూడు విడుతలుగా నిర్వహించిన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. గ్రామాల రూపురేఖలనే మార్చాయి. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజల ముందుకు చేరాయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. పరిశుభ్రతతో రోగాలు దూరమయ్యాయి. నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల విజయవంతానికి అధికారులు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లారు.
మారిన పల్లె, పట్టణ రూపురేఖలు
నార్కట్పల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతి చేపట్టిన నాటినుంచి 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. జనాభా ప్రాతిపదికన నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నది. పల్లె ప్రగతిలో ప్రధానంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యానికి ప్రాధాన్యమిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో డంప్ యార్డులు పూర్తయ్యాయి. డ్రైనేజీల నుంచి తీసిన మట్టి, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ ట్రాలీ ద్వారా పంచాయతీ సిబ్బంది డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చి సంపదను సృష్టిస్తున్నారు. అన్ని గ్రామాలో వైకుంఠధామాలు కూడాపూర్తయ్యాయి.
ఆకుపచ్చని పల్లెలు, పట్టణాల దిశగా..
29 పంచాయతీలకు గాను 29నర్సరీల్లో 2.90 లక్షల మొక్కలు పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనాలలో 48 వేల మొక్కలు పెంచారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలు పెంచేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ప్రతిఒక్కరూ సహకరిస్తున్నారు..
నాల్గో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అధికారులు, ప్రజలు సహకరిస్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. బాధ్యతగా ఇంటి ముంగిట ఆరు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పల్లెల్లో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నారు.
లక్ష్యాన్ని సకాలంలో పూర్తిచేశాం
పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేశాం. పారిశుధ్య కార్యక్రమాలు, పాడుబడిన భవనాల తొలగింపు, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేశాం. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశాం. నిరంతర ప్రక్రియగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం.