తిప్పర్తి, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఎకరం భూమిని తీసుకొని అందులో చిట్టడవిని నిర్మిస్తున్నారు. మొక్కలను పంచాయతీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు.
మెగా పార్కు పనులు ప్రారంభం
ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనంతోపాటు మండలానికో మెగా పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా తిప్పర్తి మండలంలో పజ్జూరు గ్రామాన్ని ఎన్నుకున్నారు. ఇందుకు పది ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలు మొక్కల కోసం గుంతలు తీస్తున్నారు. కంచె పనులు కూడా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 20వేల మొక్కలు నాటనున్నారు. మొత్తం రూ.42 లక్షలతో 30వేల మొక్కలను పార్కులో నాటనున్నారు. ఎక్కువగా పండ్ల మొక్కలను పెంచడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. పార్కు ద్వారా ఆహ్లాదకర వాతావరణంతోపాటు, ఆదాయం కూడా పొందాలనే ఉద్దేశంతో పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెగా పార్కు పనులను ఎంపీడీఓ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
పార్కును సుందరంగా తీర్చిదిద్దుతాం
గ్రామంలో మెగా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతాం. మా గ్రామంలో మెగా పార్కు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. పార్కు ఏర్పాటుతో గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణం కలుగుతుంది. ఆదాయం వచ్చే పండ్ల మొక్కలను సైతం పెంచుతాం. గుంతలు తీసే పనులు ప్రారంభించాం.. త్వరలో మొక్కలు నాటుతాం. – ఎస్కే మోయిజ్, సర్పంచ్, పజ్జూరు