చందంపేట, జూలై 27 : నీటి వృథాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. మండలంలోని అచ్చంపేట పట్టి గ్రామ పరిధిలోని డిండి వాగులో రూ. 9.53 కోట్లతో చెక్ డ్యాం నిర్మిస్తున్నారు. డిండి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత అలుగు ద్వారా వచ్చిన నీరు సాగర్ బ్యాక్ వాటర్లో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో చెక్డ్యాం నిర్మించడం ద్వారా వృథాగా పోయే నీటిని నిల్వ చేసి రైతులకు ఉపయోగ పడేలా చేయాలని భావించిన ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. చెక్డ్యాం నిర్మాణంతో వృథాగా పోయే 2.15 వేల క్యూసెక్కుల నీటిని నిల్వ చేయవచ్చని నీటిపారుదలశాఖ డీఈ మనోహర్ తెలిపారు. ఈ నీటితో అచ్చంపేట పట్టి, సిద్ధాపురం, పడమటి తండా గ్రామాల్లోని 410 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. చెక్డ్యాం పూర్తిస్థాయిలో నిండితే నీరు నక్కలగండి ప్రాజెక్టులోకి చేరుతుందని ఆయన తెలిపారు.