నందికొండ, మార్చి 24 : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ప్రజలు 50ఏండ్లుగా ఎలాంటి గుర్తింపునకూ నోచుకోలేదు. ఓటు బ్యాంకుగానే వాడుకున్న కాంగ్రెస్ పాలకులు సాగర్ను గ్రామ పంచాయతీగా కూడా పరిగణించలేదు. దీంతో స్థానికులు మౌలిక వసతులు కొరవడి అష్టకష్టాలు పడ్డారు. పక్కనే రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సాగర్ వాసుల కల నెరవేరుస్తూ మున్సిపాలిటీగా గుర్తింపు నిచ్చింది. లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నది.
మున్సిపాలిటీ ఏర్పాటుతో నందికొండ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నా, చితకా పనులకు పెద్దవూర సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నూతన వ్యాపార లైసెన్సులకు గతంలో 20కిలోమీటర్ల దూరంలోని పెద్దవూర మండలకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. మున్సిపాలిటీ ఏర్పాటుతో నిరంతరం తాగునీరు అందుతుండగా మున్సిపాలిటీ సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. వ్యాపారులకు, మహిళలకు రుణాలు అందుతుండడంతో ప్రజలు టీఆర్ఎస్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నందికొండలో జరిగిన అభివృద్ధి పనులు
రూ.32లక్షలతో 2ట్రాక్టర్లు, 2ట్యాంకర్లు, 2ట్రాలీ ఆటోలను, రూ.6లక్షలతో ఫాగింగ్ మిషన్, పారిశుధ్య పరికరాలు కొనుగోలు చేశారు.
రూ.1.5కోట్లతో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చేపల పెంపకం చేపడుతున్నారు. ప్రత్యేకంగా కేజ్ కల్చర్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
రూ.18కోట్లతో 100పడకల దవాఖాన ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు ఆపరేషన్ థియేటర్లు,
ఆరు అధునాతన ల్యాబ్లు నిర్మించారు.
కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో రూ.24 లక్షల వ్యయంతో సీఆర్ ఎక్స్రే, మొబైల్ ఎక్స్రే, సెల్ కౌంటర్, సీఏఆర్ఎం యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.
రూ.3కోట్ల వ్యయంతో పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనం నిర్మించారు.
రూ.2 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సామర్థ్యం కల్గిన విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించారు.
1955డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగగా.. వివిధ పనుల నిమిత్తం కొందరు, ఉద్యోగ, వ్యాపారం కోసం మరికొందరు వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాదిగా వలస వచ్చారు. జీవనోపాధి దొరకడంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 50ఏండ్లకు పైగా పాలకులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ గుర్తింపు కూడా దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగర్ దశ తిరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ను నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 12వార్డులుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి నడుం బిగించారు.
తొలి పోరులో టీఆర్ఎస్ ఘన విజయం…
నాగార్జునసాగర్ ప్రజలను ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల వేళ ఓటర్లుగానే వాడుకున్న కాంగ్రెస్ పాలకులు ఆ తర్వాత వారి బాగోగులను పట్టించుకున్న పాపానపోలేదు. 2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా.. 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారు. చైర్పర్సన్గా కర్న అనూషారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రూ.32లక్షలతో 2ట్రాక్టర్లు, 2వాటర్ ట్యాంకర్లు, 2ట్రాలీ ఆటోలను, రూ.6లక్షలతో పారిశుధ్య పరికరాలు కోనుగోలు చేశారు. గడిచిన ఆరున్నరేండ్లలో ప్రత్యేక నిధుల కేటాయింపుతో ఎన్నో పనులు చేపట్టారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేజ్ కల్చర్ యూనిట్లు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీస్టేషన్ను ఏర్పాటు చేశారు. 33/11 కేవీ సబ్స్టేషన్, 100పడకల దవాఖాన నిర్మాణం పూర్తి చేశారు. రాష్ర్టానికే మణిహారంలా నిలిచేలా చేపట్టిన బుద్ధవనం పనులు పూర్తికావచ్చాయి. కాలనీల్లో అంతర్గత సీసీ, బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనెజీ వ్యవస్థ, వీధి లైట్లను ఏర్పాటు చేశారు. నూతనంగా పాలిటెక్నిక్, బీసీ గురుకుల కళాశాలలను నందికొండలో ఏర్పాటు చేశారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నోముల భగత్ అన్నారు. నందికొండ పైలాన్కాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోయిన పార్టీ కార్యకర్త అబ్ధుల్లా కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. నోముల ఫౌండేషన్ తరఫున రూ.10వేల చెక్కును అందించారు.