తిరుమలగిరి, సెప్టెంబర్ 21 : దళిత బంధు కోసం అధికారులే మీ వద్దకు వచ్చి అన్నీ వివరిస్తారు.. యూనిట్ల ఎంపిక కోసం దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తాటిపాముల, తొండ, మాలీపురం గ్రామాల్లో దళిత బంధుపై అవగాహన కల్పించారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. అందరూ ఒకే యూనిట్లు కాకుండాఒక్కొక్కరూ ఒక్కో యూనిట్ ఎంచుకుంటే రాణించే అవకాశం ఉంటుందన్నారు. రోజు వారీ ఆదాయాన్నిచ్చే యూనిట్లు మేలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలని కోరుకుంటారో అదే విధంగా అధికారులు కూడాలబ్ధిదారుల గురించి ఆలోచించి అవగాహన కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారని వెల్లడించారు. ఎలాంటి షరతుల్లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందుతాయని తెలిపారు. తిరుమలగిరి మండలానికి చెందిన వారైతే చాలు.. బతుకు దెరువు కోసం వలస వెళ్లిన వారికి కూడా వర్తిస్తుందని అన్నారు. యూనిట్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా వ్యాపారం ప్రారంభించవచ్చని చెప్పారు. అధికారులు త్వరలోనే ఇంటింటి సర్వే నిర్వహిస్తారని, వారికి కచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష. మున్సిపల్ చైర్పర్సన్ రజిని, ఎంపీడీఓ ఉమేశ్ చారి, ఎంపీఓ మారయ్య పాల్గొన్నారు.