నల్లగొండ, జూన్ 9 : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జిల్లాలో చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే దూర భారంతో ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. దాంతో ప్రజలకు దూర భారం తగ్గడంతో పాటు ఉత్తమ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం నల్లగొండను మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఆరు మున్సిపాలిటీలు, ఆరు మండలాలు, 349 గ్రామ పంచాయతీలను చేసి పాలన ప్రజల దగ్గరకు చేసి స్వ(సు)పరిపాలన అందిస్తున్నది. ఇక పలు శాఖలను సైతం పునరవ్యవస్థ్దీకరించడంతోఅధికారుల పర్యవేక్షణ పెరిగి ప్రజలకు సేవలు దగ్గరయ్యాయి.
పెరిగిన పర్యవేక్షణ…
రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో వేగంగా విస్తరిస్తుండగా ఆ వ్యవసాయానికి సాగునీరిచ్చే నీటి పారుదల శాఖ మాత్రం గతంలో నిరాదరణకు గురైంది. మూడు జిల్లాలకు కలిపి ఒక ఎస్ఈని నియమించిన నాటి ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మాత్రం ఒక ఈఈని మాత్రమే ఇచ్చింది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ శాఖను పునర్వ్యవస్థ్దీకరించి నల్లగొండ జిల్లాకు చీఫ్ ఇంజినీర్ పోస్టు ఇవ్వడంతో పాటు మూడు సర్కిళ్లుగా(ఎస్ఈలు) విభజించి వాటి పరిధిలో 12 డివిజన్లు, 46 సబ్డివిజన్లు చేయడం మూలంగా సాగు నీటిపై పర్యవేక్షణ పెరిగి రైతుకు కావాల్సిన సాగు నీరు నిరాటంకంగా అందుతున్నది. రోడ్లపై నిత్య పర్యవేక్షణ ఉండాలని పీఆర్, ఆర్అండ్బీలను వేరు చేశారు.. పంచాయతీ రాజ్ శాఖను బైఫర్ గేషన్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రెండు జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజినీర్ను నియమించి నల్లగొండలో మరో రెండు పంచాయతీరాజ్ డివిజన్లు చేయనున్నారు. తాగు నీటి సరఫరా విభాగాన్ని పూర్తి స్థాయి బైఫర్ గేషన్ చేసిన సర్కార్ మిషన్ భగీరథ పేరుతో ఆర్డబ్ల్యూఎస్ నుంచి విభజించి రెండు డివిజన్లు, నాలుగు సబ్ డివిజన్లు చేసింది నిత్యం తాగునీటి పర్యవేక్షణ చేస్తుంది.
సబ్ సెంటర్ కో డాక్టర్..
తొమ్మిదేండ్ల కింద జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ ఆస్పత్రులు మినహాయిస్తే మిగిలిన నియోజక వర్గాల ఆస్పత్రులు, మండలాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉండే వారు. ఆ తర్వాత అన్నింటికి తాళం పడేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పీహెచ్సీలతో పాటు అర్బన్ ఆస్పత్రులను 24 గంటల ఆస్పత్రులుగా మార్చిన సర్కార్ సబ్సెంటర్లకు సైతం డాక్టర్లను కేటాయించింది. దాంతో రెండు మూడు గ్రామాలకు కలిపి ఉండే సబ్సెంటర్లో ఓపీ సేవలు అందుతున్నాయి. ఇక ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు నిర్ణీత వేతనం ఇవ్వడం వల్ల వారి సేవలు సైతం పెరిగాయి. ఇక విద్యుత్ శాఖలోనూ డివిజన్లు పెంచడంతో పాటు కొత్త జిల్లాలకు ఎస్ఈని కేటాయించడంతో పర్యవేక్షణ పెరిగి సేవలు రెట్టింపు అయ్యాయి.
పెరిగిన మండలాలు, మున్సిపాలిటీలు
రాష్ట్రం ఏర్పాటు తర్వాత పాలన కోసం వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటయ్యాయి. నల్లగొండలో కొత్తగా 349 గ్రామ పంచాయతీలు ఏర్పడగా ఆరు మండలాలు (మాడ్గులపల్లి, నేరేడుగొమ్ము, అడవిదేవులపల్లి, గట్టుప్పల్, కొండ మల్లేపల్లి, తిర్మలగిరి (సాగర్), ఆరు మున్సిపాలిటీలు (నందికొండ, దేవరకొండ, చండూరు, హాలియా, నకిరేకల్, చిట్యాల) కొత్తగా ఏర్పడ్డాయి. యాదాద్రి జిల్లాలో జిల్లా ఏర్పాటు కంటే ముందు ఒక్కటే మున్సి పాలిటీ ఉండేది. కొత్తగా మోటకొండూరు, అడ్డగూడూరు మండలాలు ఏర్పాడ్డాయి. ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూ రు, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ఏర్ప డ్డాయి. ఆయా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో కొత్తగా పాలక వర్గంతో పాటు అన్ని శాఖల అధికారులను కేటాయించడంతో పాలన సులభమై ప్రజలకు వ్యయ ప్రయాస తగ్గింది.
సాగు నీటి ఇబ్బందుల్లేకుండా ఇస్తున్నాం
గతంలో చిన్న, భారీ నీటి పారుదల శాఖగా వేర్వేరుగా ఉండటంతో పాటు ఉమ్మడి జిల్లాకు ఈఈ పోస్టు మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలకే ఒక చీఫ్ ఇంజినీర్ను కేటాయించడంతో పాటు మూడు సర్కిళ్లు ఏర్పాటు చేసి 12 డివిజన్లు, 46 సబ్ డివిజన్లు చేసింది. ఆ డివిజన్లలో సిబ్బందిని సైతం నియమించడం వల్ల పరిపాలన చాలా సులభంగా ఉంది. జిల్లా అంతటా సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా సాగు నీరు ఇవ్వగలుతున్నాం.
– అజయ్ కుమార్, ఐబీ సీఈ, నల్లగొండ