మునుగోడు, జూలై 16 : నియోజకవర్గ కేంద్రమైన మునుగోడులో సర్కారు జాగలు 30 ఏండ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమి.. స్థానిక తాసీల్దార్ కృషితో ప్రభుత్వ పరమయ్యాయి. చివరకు సదరు స్థలాన్ని మెగా నర్సరీ ఏర్పాటు కోసం కేటాయించారు.
గతంలో ప్రభుత్వ భూమి లేక..
మునుగోడుకు గతంలో మంజూరైన పలు ప్రభుత్వ నిర్మాణాలకు సర్కారు జాగ అవసరమైంది. రెవెన్యూశాఖ రికార్డులు తిరగేసినా, క్షేత్రస్థాయిలో సర్వే చేసినా గుంట భూమి దొరకలేదు. దీంతో మునుగోడుకు మంజూరైన మోడల్ స్కూల్ ఏర్పాటుకు నోచుకోలేదు. విద్యుత్ సబ్స్టేషన్కు స్థలం దొరక్క పక్కనే ఉన్న గూడపూర్లో ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వ భూమి లేక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.
పదిరోజుల పాటు సర్వే…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలోనూ మెగా నర్సరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కలెక్టర్ నుంచి రెవెన్యూశాఖకు ఆదేశాలు వచ్చాయి. అసలు మునుగోడులో అంత ప్రభుత్వ భూమి ఒకేచోట దొరకడం అసాధ్యమని రెవెన్యూశాఖ సిబ్బంది భావించారు. దీంతో ఈ అంశాన్ని తాసీల్దార్ శ్రీనివాసులు ఓ సవాలుగా తీసుకున్నారు. మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న లక్ష్మీదేవిగూడెంలోని సర్వే నంబర్ 78లో గత నెల 25న సర్వే మొదలుపెట్టారు. ఈ నెల 5వరకు దాదాపు పది రోజుల పాటు 45 ఎకరాల భూమిని సర్వే చేశారు. అక్కడ అనధికారికంగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. రికార్డుల ప్రకారం ఎవరి భూమి వారికి కొలిచి ఇవ్వగా ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం లభ్యమైంది. సుమారు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలాన్ని మెగా నర్సరీ ఏర్పాటుకు కేటాయించి ఈ నెల 7న ఎంపీడీఓ యాకూబ్ నాయక్కు అందించారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు
అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్కారు జాగలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగపడాలి. మెగా నర్సరీ ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం 10రోజుల పాటు సర్వే చేసి ఐదెకరాలను కేటాయించాం. ఇకపైన ప్రభుత్వ నిర్మాణాలకు భూమి కావాల్సి వస్తే సర్వే జరిపి కేటాయించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం.