నేరేడుగొమ్ము(చందంపేట), జూలై 22 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మోసమ్గడ్డతండాలో గురువారం గిరిజనులకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలల చదువులు, ఆరోగ్యం, అభివృద్ధి, హక్కుల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చి శ్రమ దోపిడీ చేయొద్దని, ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చట్ట విరుద్ధమన్నారు. ఆడ పిల్లలను విక్రయించినా, మానవ అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవరకొండ జూనియర్ సివిల్ జడ్జి అజయ్, న్యాయవాదుల సంఘం కార్యదర్శి రమాశంకర్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, శిశు సంక్షేమాధికారి ఖతీజా, ఎస్ఐ సతీశ్, సర్పంచ్ హాస్య పాల్గొన్నారు.