తిరుమలగిరి, జూలై 18 : గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తరలి వస్తున్నాయి. ఎస్సారెస్పీ అధికారులు ఆదివారం జనగాం జిల్లా బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయగా.. తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద డీబీఎం 69 నుంచి జిల్లాకు చేరుతున్నాయి. దీంతో జిల్లాలోని 500లకు పైగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయి. 69, 70, 71 డీబీఎంకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ మండలాల్లో వానకాలం సాగుకు పుష్కలంగా సాగునీరు అందనుంది.
ఐదోసారి నీటి విడుదల
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు వరుసగా 42 రోజులు ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలు అందించింది. అనంతరం 2018 అక్టోబర్ 5న 20 రోజులు నీటిని విడుదల చేసి వందకు పైగా చెరువులను నింపి రైతుల పంటలను కాపాడింది. తిరిగి 2019 అక్టోబర్ 20న కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు 100 రోజులకు పైగా విడుదల చేసి జిల్లాలోని చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకుంది. 2020 జూలై 19న వానకాలం పంట చేతికందే వరకు సాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో పంటకు సైతం నీటిని అందించింది. గత సంవత్సరం కంటే ఒకరోజు ముందుగానే వానకాలం పంటలు సాగు చేసేందుకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో
వానకాలం పంటలు పూర్తిస్థాయిలో సాగయ్యే వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో గోదావరి జలాలు అందనున్నాయి. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎస్సారెస్పీ కాల్వద్వారా మొదట ఎగువన ఉన్న కోదాడ నుంచి దిగువన ఉన్న సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలకు సాగునీరు అందించనున్నారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి చెరువులు కుంటలు నింపాలని ప్రభుత్వం భావిస్తున్నది.
నిండిన బయ్యన్నవాగు రిజర్వాయర్
తిరుమలగిరి మండలంలోని వెలిశాల 69 డీబీఎం సరిహద్దులో ఉన్న బయ్యన్న వాగు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నది. వరంగల్ జిల్లా వర్ధన్న పేట వద్ద ప్రారంభమయ్యే ఎస్సారెస్పీ రెండో దశ కాల్వ ద్వారా జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్న వాగు రిజర్వాయర్ నుంచి తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద జిల్లాకు చేరుతుంది. ప్రధాన కాల్వతో పాటు 69,70,71 మెయిన్ డిస్ట్రీబ్యూటరీ (డీబీఎం)కాల్వలు ఉన్నాయి. వెలిశాల నుంచి నాగారం మండలం ప్రగతి నగర్ వరకు 8 కిలో మీటర్ల మేర ప్రధాన కాల్వ ఉంది.
పూర్తిస్థాయిలో సాగునీరు
69 డీబీఎం తిరుమలగిరి మండలంలోని వెలిశాల నుంచి మొదలవుతుంది. మొత్తం 27 కిలోమీటర్ల మేర కాల్వ కింద 69,956 ఎకరాల ఆయకట్టు ఉండగా నూతనకల్, తుంగతుర్తి, మద్దిరాల మండలాలకు సాగునీరు అందుతున్నది. 70 డీబీఎం కింద ఆయకట్టు 7,173 ఎకరాలు కాగా నాగారం మండలంలోని మామిడిపల్లి వద్ద ఈ కాల్వ ప్రారంభం అవుతున్నది. ఈ కాల్వ ద్వారా నాగారం, అర్వపల్లి మండలాల్లో సాగునీరు అందుతున్నది. డీబీఎం 71 కింద ఆయకట్టు 1,44,480 ఎకరాలు కాగా ఈ కాల్వ నాగారం ప్రగతినగర్ వద్ద మొదలవుతుంది. దీని ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, చివ్వెంల, కోదాడ, నియోజకవర్గంలోని నడిగూడెం, మోతే, మునగాల మండలాల్లో 1,44,480 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
మూడు డీబీఎంల పరిధిలో ..
ఎస్సారెస్పీ కాల్వ చరిత్రలోనే 69,70,71 డీబీఎంల పరిధిలోని 2,21,609 ఎకరాలు సాగులోకి రావటం ఒక రికార్డు. గతంలో సాగునీరు అందక కరువు నేలగా ఉన్న ఈ ప్రాంతం సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగంలో నూతన శకం మొదలైంది. అసలు ఎస్సారెస్పీ కాల్వలతో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందా అని భావించిన రైతుల ఊహలకు అందని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీటిని అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. కరువు నేలలో సిరులు పండించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.