సూర్యాపేట అర్బన్, జూలై 25 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుతుండడంతో వీటిలో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో గురుకుల విద్యా సంస్థల్లో నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ కూడా హాజరవుతారు. ఫలితంగా సమస్యలను సత్వరమే పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతిధులు కృషి చేయనున్నారు.
తగ్గనున్న దూరభారం
గురుకులాల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహిస్తుండగా.. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల్లో సీటు వస్తే అక్కడికి వెళ్లి ఉండాల్సి వస్తున్నది. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం స్థానిక విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించడంతో విద్యార్థులకు దూరాభారం తప్పనున్నది. సూర్యాపేట జిల్లాలో ఉన్న 9 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్న 5 వేల సీట్లకు గాను 2,500, 8 బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో 640 సీట్లు ఉండగా 320 సీట్లు స్థానిక విద్యార్థులకే అందనున్నాయి.
పేద విద్యార్థులకు ప్రయోజనం
గురుకులాల్లో స్థానిక నియోజక వర్గాల విద్యార్థులకే 50 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద వర్గాలకు ప్రయోజనం కలుగనున్నది. వారి తల్లిదండ్రులకు దూరభారం తగ్గడంతో పాటు ఎక్కువ మంది విద్యార్థులు గురుకులాల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆర్థికఇబ్బందులు కూడా తీరుతాయి.
నాణ్యమైన విద్య అందుతుంది
గురుకుల విద్యాలయాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు సమస్యలూ పరిష్కారమవుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. గురుకుల విద్యావ్యవస్థలో పారదర్శకత ఏర్పడుతుంది.