తిప్పర్తి, జూలై 11 : నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి సాగు చేయడం వల్ల ఆదాయం తక్కువగా వస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి, వరి సాగు కంటే ఆరుతడి పంటల వల్ల ఎక్కువగా ఆదాయం పొందవచ్చని, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయవచ్చని ఆ దిశగా ప్రయత్నిస్తునారు. సిలార్మియాగూడెం గ్రామంలో ఇద్దరు రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. స్ప్రింక్లర్ల ద్వారా నీరు పెడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతోపాటు తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేయాలనే లక్ష్యంతో గ్రామానికి చెందిన యర్రమాద శ్రీనివాస్రెడ్డి, మైనంపాటి సురేందర్రెడ్డి సుమారు 8ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. వరి సాధారణంగా సంవత్సరానికి రెండు పంటలు మాత్రమే వస్తాయి.. కానీ వేరుశనగ మూడుసార్లు పండించవచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరి ఎకరం సాగుచేసే నీటితో ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేయవచ్చని, వరికి ఎకరానికి సుమారు రూ.20 వేల పెట్టుబడి కాగా వేరుశనగకు రూ.7 వేలు మాత్రమే అవుతుంది. వరికి ఎకరానికి 20నుంచి 30వేల ఆదాయం వస్తున్నప్పటికీ వేరు శనగకు రూ.80 వేల ఆదాయం పొందవచ్చు.
వరి కంటే వేరుశనగ మేలు
వరి సాగుకు ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెడితే ఆదాయం మాత్రం రూ.30 వేలు వస్తాయి. వేరుశనగ సాగుకు ఎకరానికి రూ.7 వేల ఖర్చు చేస్తే రూ.80 వేల వరకు ఆదాయం ఉంటుంది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు వేరుశనగ సాగు చేస్తున్నాను. అనంతపురం నుంచి విత్తనాలను తెచ్చుకున్నా.
పెట్టుబడి, శ్రమ తక్కువ
మూడెకరాల్లో వేరుశనగ సాగు చేశాను. పత్తి, వరి పంటలకు కూలీల కొరత, పెట్టుబడి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశనగ సాగు చేశా. దీనికి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుంది. వేరుశనగ తరువాత మొక్కజొన్న సాగు చేస్తా. వరి, పత్తి మానేసి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాను. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తున్నాను.