రామగిరి, జూలై 25 : డా॥ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆగస్టు 12వరకు గడువు ఉన్నట్లు యూనివర్సిటీ నల్లగొండ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ వెల్లడించారు. నల్లగొండలోని యూనివర్సిటీ భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అతితక్కువ ఫీజులతో దూరవిద్యలో విద్యనందించే ఏకైక యూనివర్సిటీ బీఆర్ఏఓయూ అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన యూనివర్సిటీ ఇదే అని తెలిపారు. అర్హులంతా అడ్మిషన్లు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అధ్యయన కేంద్రాలున్నట్లు తెలిపారు. పీజీ విద్యార్థులకు నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో, మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యయన కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. యూజీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎమ్కాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, జర్నలిజం కోర్సులున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నల్లగొండలోని యూనివర్సిటీ భవనంలో గానీ, 08682 223768, 7989339180(శ్రీకాంత్), 7382929610(మహేశ్), 9533101295నంబర్లలో గానీ, www.braouonline.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది బద్దం మహేశ్, శ్రీకాంత్, సపావత్ రేఖ్యానాయక్ పాల్గొన్నారు.
యూడైస్ ఆన్లైన్ ఎంట్రీ ఆకస్మిక తనిఖీ
ఫ్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు, మౌలిక వసతుల కోసం ఆయా పాఠశాలల నుంచి సేకరించిన యూడైస్ ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియను ఆదివారం జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి మండల వనరుల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూడైస్ నమోదు, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ యూడైస్ నమోదులో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నమోదు విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కో ఆర్టినేటర్(సెక్టోరియల్ అధికారులు)కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీలు, ఎంఐఎస్, ఎల్డీఏలు ఉన్నారు.